KTR Accident News: నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ (Armour) లో నిర్వహించిన బీఆర్ఎస్ నామినేషన్ ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి (Jeevanreddy) నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ (Minister Ktr) హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులతో ర్యాలీగా రిటర్నింగ్ కార్యాలయానికి వెళ్లారు. ప్రచార రథంపై కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డి, జీవన్ రెడ్డి ఇతర నేతలు వెళ్తుండగా, వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో రెయిలింగ్ విరిగింది. ఈ క్రమంలో దాన్ని ఆనుకుని ఉన్న నేతలు ఒక్కసారిగా తూలి కిందపడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే కేటీఆర్ ను పట్టుకున్నారు. అయితే, మంత్రి కేటీఆర్, ఎంపీ సురేష్ రెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఆర్మూర్ పట్టణంలోని పాత ఆలూరు రోడ్డు వద్ద ఈ ఘటన జరిగింది. ఎవరికీ ఏం కాకపోవడంతో అంతా నామినేషన్ కేంద్రానికి వెళ్లారు. 






కేటీఆర్ స్పందన


కాగా, ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. 'అదృష్టవశాత్తు, దేవుని దయతో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. నా ఆరోగ్య పరిస్థితిపై కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందవద్దు.' అని అన్నారు. ప్రమాదం తర్వాత కొడంగల్ రోడ్ షోకు బయల్దేరి వెళ్లారు. 


ఎంపీకు స్వల్ప గాయాలు


ర్యాలీలో ఒక్కసారిగా వాహనం సడన్ బ్రేక్ వేయడంతోనే రెయిలింగ్ కూలి ముందుకు తూలి పడ్డామని ఎంపీ సురేష్ రెడ్డి తెలిపారు. తనకు స్వల్ప గాయాలయ్యాయని చెప్పారు. మంత్రి కేటీఆర్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, కార్యకర్తలెవరూ ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ఈ ఘటనలో దేవుని దయతో అందరం క్షేమంగా బయటపడ్డామని అన్నారు. ఘటన అనంతరం జీవన్ రెడ్డి నామినేషన్ కు హాజరైనట్లు చెప్పారు.


నామినేషన్ల కోలాహలం


కాగా, నామినేషన్లకు రేపటితో గడువు ముగియనుండగా రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల కోలాహలం నెలకొంది. గురువారం మంచిరోజు కావడంతో నామినేషన్లు వేసేందుకు నేతలు పోటెత్తారు. సీఎం కేసీఆర్ సహా, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సహా ఇతర అగ్రనేతలు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో, మంత్రి కేటీఆర్ సిరిసిల్ల, హరీష్ రావు సిద్ధిపేటల్లో రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లు సమర్పించారు. సూర్యాపేటలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నామినేషన్లు వేశారు. ఈ క్రమంలో ఆయా చోట్ల పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా వెళ్లి నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అంతటా సందడి నెలకొంది. బోధన్ లో బీఆర్ఎస్ అభ్యర్థి షకీల్ నామినేషన్ కు ముందు ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత సందడి చేశారు. ఆమె స్కూటీపై రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్నారు.


Also Read: CM Kcr Nomination 2023: గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్ - సిరిసిల్లలో కేటీఆర్, సిద్ధిపేటలో హరీష్ రావు నామినేషన్