కామారెడ్డి జిల్లాలో నిజాం సాగ‌ర్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిజాంసాగ‌ర్ – పిట్లం ర‌హ‌దారిలో మంజీరా న‌దిపై నూత‌నంగా రూ. 25 కోట్ల‌తో బ్రిడ్జిని నిర్మించారు. ఈ వంతెనతో తెలంగాణ క‌ర్ణాట‌క రాష్ట్రాల‌ మధ్య రాకపోకలు సాఫీగా సాగుతాయి. పిట్లం, బిచ్కుంద, మద్నూర్‌, కర్నాటక, నారాయణఖేడ్‌, సంగారెడ్డి, జహీరాబాద్‌ జాతీయ రహదారిపైకి వెళ్లాలంటే మంజీరా రివర్ మీద ఉన్న వంతెనే దిక్కు. అయితే ఆ బ్రిడ్జి సుమారు వంద ఏళ్ల కిందట నిర్మించారు. ప్రస్తుతం అది శిథిలావస్థకు చేరుకుంది. అందుకే పాత వంతెన పక్కనే రూ.25 కోట్ల వ్యయంతో కొత్త వారధిని నిర్మించారు. శిథిలావస్థకు చేరుకున్న పాత బ్రిడ్జి ఆరు నెలల కిందటే కూలిపోయింది. దీంతో కొత్తగా నిర్మించిన వంతెన పై నుంచి తాజాగా రాకపోకలు ప్రారంభించారు మంత్రి కేటీఆర్.


మరోవైపు నాలుగు మండలాల్లోని 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి సర్కారు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ఎత్తిపోతల పథకాన్ని  మంత్రి కేటీఆర్‌ రైతులకు అంకితం చేశారు. అనంతరం జుక్కల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు.


జుక్కల్ లో అమలవుతున్న పథకాలు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర లో ఉన్నాయా అని ప్రశ్నించారు కేటీఆర్. జుక్కల్ నియోజకవర్గానికి రైతుబంధు ద్వారా 486 కోట్లు ఇచ్చామన్నారు! రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల రైతు కుటుంబాలకు రైతు బంధు ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. విద్యుత్, ఇరిగేషన్ రంగాలు పక్క రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయో అడగండని ప్రజలకు పిలుపునిచ్చారు. కాళేశ్వరం ఎత్తిపోతలతో నిజాంసాగర్ కు జీవం పోశామని స్పష్టం చేశారు. గోదావరి నుంచి మంజీరా కు నీటిని మల్లించామని, కాంగ్రెస్ పాలనలో కరెంటు ఉంటే వార్త కేసీఆర్ పాలనలో కరెంటు పోతే వార్త అన్నారు కేటీఆర్



గిరిజన తండా లను గ్రామాలుగా మార్చిన ఘనత తమదే అన్నారు కేటీఆర్. బిచ్కుంద, పిట్లం మండలాలను మున్సిపాలిటీ గా మారుస్తామని హామీ ఇచ్చారు. కులవృత్తులకు ప్రాధాన్యత కల్పించామని, నిధులు ఇచ్చి ఉపాధి కల్పించామని చెప్పుకొచ్చారు. వెయ్యి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు కేటీఆర్. తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డిగొంతు చించుకుంటున్నాడని విమర్శించారు. 10 అవకాశాలు ఇస్తే 50 ఏళ్లు పాలించి ఏం చేశారని ప్రశ్నించారు. పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క చాన్స్ ఇవ్వమని అడుగుతున్నారని ఎద్దేవా చేశారు.


అబద్ధాలు చెప్పడంలో, నమ్మించి మోసం చేయడంలో మోదీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ విమర్శించారు. దేశసంపద అంతా దోస్తు ఖాతాలో జమచేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీశారు. నల్లధం తెస్తానని ఇపుడు తెల్లమొఖం వేశారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలని పిలుపునిచ్చారు.


తెలంగాణ పై కేంద్రం కక్ష గట్టిందని కేటీఆర్ అన్నారు. తెలంగాణకు పట్టిన శని బీజేపీ అనీ, మోడీలకు ఈడీలకు భయపడబోమని స్పష్టం చేశారు. ఏదైనా సరే ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటామని సవాల్ విసిరారు. కేసీఆర్ ను కాపాడుకుని, మూడోసారి సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు.