ఇటీవల కామారెడ్డి రైతులు చేసిన తరహాలోనే ఇప్పుడు జగిత్యాల రైతులు కూడా మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. జగిత్యాల రూరల్ మండలం అంబర్ పేట గ్రామ ప్రజలు జగిత్యాల మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రీయల్ జోన్ ను ఎత్తి వేయాలని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. జగిత్యాల - నిజామాబాద్ జాతీయ రహదారిపై గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆటోలు, ట్రాక్టర్ పై గ్రామస్థులు భారీగా తరలి వచ్చి ధర్నా చేశారు. గ్రామస్తులందరూ కలిసి రోడ్డుపైనే వంట వార్పు నిర్వహించారు. మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ నుంచి తొలగించాలని, గ్రామ ప్రజలు, రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. దీంతో జాతీయ రహదారిపై నిలిచిన వాహనాల వల్ల బాగా ట్రాఫిక్ జామ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.


మున్సిపల్ కమిషనర్ కు తీర్మానాలు


అంతకుముందు మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా గ్రామ పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవ తీర్మానాలు చేసింది. తిమ్మాపూర్ గ్రామ సభకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాజరై రైతులకు మద్దతు తెలిపారు. పలు గ్రామాల ఏకగ్రీవ తీర్మానాలను గ్రామస్థులు మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు.


జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ విలీన గ్రామాల రైతులు మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టర్ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరారు. జగిత్యాల మాస్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. నిన్న జగిత్యాల-నిజామాబాద్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.


మాస్టర్ ప్లాన్ అంటే


జగిత్యాల మాస్టర్ ప్లాన్ పరిధిలో నర్సింగాపూర్, కండ్లపల్లి, తిమ్మాపూర్, తిప్పన్నపేట, హుస్నాబాద్, లింగంపేట, మోతె గ్రామాలను చేర్చాలనే ప్రతిపాదన ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌ను సిద్ధం చేసింది. అయితే మాస్టర్ ప్లాన్ కు అవసరమైన భూమిని సేకరిస్తారు. దీంతో ఆయా గ్రామాల రైతులు భూములు కోల్పోతామంటూ ఆందోళన చెందుతున్నారు.


మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా కామారెడ్డిలో నిరసనలు 


కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి పట్టణంలోని కొన్ని రోజుల క్రితం రైతులు ఆందోళన చేస్తున్నారు. మహా ధర్నా పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలో 8 గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేయాలని రైతులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ఇండస్ట్రియల్ జోన్ పేరుతో తమకు తీరని అన్యాయం జరుగుతోందని రైతులు మొదట్నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ పై బుధవారంతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. గురువారం మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే బాధిత రైతులు కామారెడ్డి పట్టణానికి చెందిన 49 మంది కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి అత్యవసర కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయాలని వినతి పత్రాలు కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.