Nizamabad News : నిజామాబాద్ జిల్లాలో ఐటీ రంగం దూసుకెళ్లే అవకాసం కనిపిస్తోంది.  ఇటీవల   నిజామాబాద్ లో ఐటీ హ‌బ్‌ ను ప్రారంభించారు. కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. తాజాగా ఎమ్మెన్సీ కూడా తమ బ్రాంచ్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.  అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచి గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్ తన కంపెనీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న గ్లోబల్ లాజిక్ సంస్థకు హైదరాబాద్‌లో రెండు క్యాంపస్‌లు ఉన్నాయి. గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌లో వారి కంపెనీలో ప్రస్తుతం దాదాపు 3,000 మంది పనిచేస్తున్నారు.                                                                       

  


నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీ ఏర్పాటు చేయడంపై ఈ నెల మొదటి వారంలో ఆ సంస్థ ప్రతినిధులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చర్చలు జరిపారు. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కవిత ఇచ్చిన హామీ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు నిజామాబాద్ ఐటి హబ్‌ను ఇటీవల సందర్శించారు. అనంతరం కంపెనీ ఏర్పాటుకు ప్రతిపాదించగా కాలిఫోర్నియాలోని వారి ప్రధాన కార్యాలయం అనుమతులు ఇచ్చింది. కల్వకుంట్ల కవితతో సమావేశమైన కేవలం 29 రోజుల్లోనే సంస్థ ఏర్పాటు అవుతోంది.                                        


అంతర్జాతీయ సంస్థ గ్లోబల్ లాజిక్ సంస్థ నిజామాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని కవిత సంతోషం వ్యక్తం చేశారు. ఐటీ అభివృద్ధి ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అపూర్వ స్పందన వస్తోందని తెలిపారు. ఇప్పటికే అనేక మందికి ఉద్యోగాలు లభించాయని, రెండు జాబ్ మేళాలు నిర్వహించామని వివరించారు.  [ 





గ్లోబల్ లాజిక్ కంపెనీ ఏర్పాటుతో స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయ‌న్నారు. ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండానే యువతకు స్థానికంగానే ఉద్యోగ కల్పన లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఐటీ హబ్ ఆలోచన చేశారని చెప్పారు. నిజామాబాద్ ఐటీ హబ్‌ను భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని, భవిష్యత్తులో మరిన్ని ప్రముఖ కంపెనీలు ఏర్పాటు అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.