దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కుటుంబం పాత్ర ఎంతో ఉందని, దేశం కోసం ఆయన కుటుంబంలో నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ ప్రాణాలు అర్పించారని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. కానీ నీరవ్ మోడీ, లలిత్ మోడీ భారతదేశ సంపదను దోచుకుని విదేశాలకు వెళితే దానిని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీపై కేసు పెట్టడం సరైన చర్య కాదన్నారు. 


నిజామాబాద్ లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీని పప్పు అని, సోనియా గాంధీని దేశ వాసి కాదని మాట్లాడితే తప్పులేదు.. కానీ దేశాన్ని దోచుకున్న వారి గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే అక్రమంగా కేసులు పెడతారా అని ప్రశ్నించారు సుదర్శన్ రెడ్డి. కుబేరుడు అదానీకి రూ.12 లక్షల కోట్ల ప్రజాదనాన్ని నరేంద్ర మోడీ కట్టబెట్టారని, ప్రధానికి, అదానీకి ఉన్న సంబంధం గురించి రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇవ్వలేదని, చివరగా పార్లమెంటులో రాహుల్ గాంధీపై అనర్హత వేయడం చాలా బాధాకరం అన్నారు. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. 


ఎన్నికల సమయంలో జీరో అకౌంట్ ఉన్న ప్రతి ఖాతాలో రూ.15 లక్షలు ఇస్తామని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గెలిచారని ఇలాంటి తప్పుడు హామీలపై ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని, రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తే దానిని ఆపడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. రాహుల్ చేసిన భారత్ జోడో పాదయాత్రతో ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ప్రజల మద్దతును, స్పందనను చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు బీజేపీ పూనుకుందని విమర్శించారు సుదర్శన్ రెడ్డి. దేశాన్ని దోచుకున్న వారిని దొంగలు అంటే కేసులు పెట్టడం సరైనది కాదన్నారు. 


రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటు వేయడం అంటే బీజేపీ ప్రభుత్వం  పార్లమెంట్ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని, రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, బీజేపీకి వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాడుతున్నారని, అదానీ కంపెనీల వ్యవహారాలపై జేపీసీ వేయాలని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ పోరాటం చేయడం ప్రధాని మోడీకి కంటి మీద కునుకులేకుండా చేసిందని, అదానీ వ్యవహారాన్ని పార్లమెంటులో ఎండగడుతున్నందుకే బీజేపీ  తమ నేతపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే.. రాహుల్​ గాంధీని బీజేపీ టార్గెట్​ చేసిందని, ఆయనపై లోక్‌సభ సెక్రెటరీ అనర్హత వేటు వేయడం దుర్మార్గమని అన్నారు సుదర్శన్ రెడ్డి. కోర్టు కూడా 30 రోజులు అప్పీల్‌కు టైం ఇచ్చింది.. అయినా హడావుడిగా రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమే అని అన్నారు. ఈ కుట్రను తిప్పి కొట్టేందుకు కాంగ్రెస్ నేతలు న్యాయపోరాటం చేస్తారని సుదర్శన్ రెడ్డి వెల్లడించారు.