Crop Loan Waiver in Telangana: రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.  సగం మంది రైతులకు కూడా కాంగ్రెస్‌ సర్కారు రుణమాఫీ చేయలేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికే వైవిధ్యంగా పలుమార్లు ఆందోళనలు చేపట్టిన రైతులు తాజాగా ‘సెల్ఫీ ఫర్‌  రుణమాఫీ’ పేరుతో వినూత్న ఉద్యమం చేపట్టారు. ఇందులో భాగంగా ఆదివారం సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపేందుకు వీలుగా సెల్పీ వీడియోలు తీసుకుని పంపుతున్నారు. రైతులంతా ఒక్కచోట చేరి ‘సెల్ఫీ ఫర్‌ రుణమాఫీ’ వీడియోలు తీసి ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ తదితర  సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సీఎంవోకు పంపే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


పొలంలో పాసుబుక్కులతో సెల్పీలు 
ఈ క్రమంలోనే ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోనీ ముఖరా (కే) గ్రామంలోనీ రుణమాఫీ కానీ రైతులు పంట పొలాల్లో వినూత్న నిరసన చేపట్టారు. రెండు లక్షలకు మించి బకాయిలు ఉన్న రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేస్తు పంట పొలాల్లో పట్టా పాస్ పుస్తకాలతో సెల్ఫీలు దిగి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. రెండు లక్షలకు పైగా ఉన్న రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలనీ, రైతు భరోసా డబ్బులను వెంటనే రైతుల అకౌంట్లలో జమ చేయాలనీ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి అమలు చేయాలని, రైతులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతులంతా కలిసి సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.







సిద్ధిపేటలో సేమ్ సీన్
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో కూడా రుణమాఫీ కానీ రైతులు.. "సెల్ఫీ ఫర్ రుణమాఫీ" అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం ధర్మారం గ్రామంలోని రైతులు అందరూ కలిసి ఒకచోట చేరి "సెల్ఫీ ఫర్ రుణమాఫీ" వీడియోలు తీసి సీఎంవోకు చేరేలా ఫేస్ బుక్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, నాయకులు మాట్లాడుతూ.. రుణ మాఫీ కానీ రైతులు ఎంత మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. వారి వేదనను కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ డిజిటల్ ఉద్యమాన్ని చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. రుణ మాఫీ చేసిన అని జబ్బలు చరుచుకుంటున్న ముఖ్యమంత్రికి.. రైతులు గట్టి జవాబు చెబుతూ.. సెల్ఫీ వీడియోలు తీసి పంపారని తెలిపారు.  



ధర్మారంలోనే 300 రైతులు
 సిద్ధిపేట జిల్లాలోని ఒక్క ధర్మారం గ్రామంలోనే 300 మంది రైతులు సీఎం రేవంత్ రెడ్డికి సెల్ఫీ వీడియోలు తీసి పంపారు.  రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేశామని అసత్య ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ కు.. రుణమాఫీ కానీ రైతుల సెల్ఫీ వీడియోలే గుణపాఠం చెబుతాయని నాయకులు హెచ్చరిస్తున్నారు.సీఎం, మంత్రులు వందశాతం రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకోవడం తప్పితే.. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదంటూ వారు ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి అలోచించి అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.  లేనిపక్షంలో సీఎం రేవంత్ ని రైతులు సెల్ఫీ వీడియోల ద్వారా డిజిటల్ ర్యాగింగ్ చేస్తారంటూ హెచ్చరించారు. రుణమాఫీ చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ సెల్ఫీ వీడియో ఉద్యమం లేపడం ఖాయం అన్నారు.