Atram Sugunakka Complaint against KTR | ఉట్నూరు: కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై చర్యలు తీసుకోవాలని ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో మాట్లాడారు.


కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర


త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు నిరాధారమైన,నిర్లక్ష్య పూరిత ఆరోపణలు కేటీఆర్ చేస్తున్నారని పేర్కొన్నారు. నవంబర్ 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అప్పటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రజా పాలన కొనసాగడంపై బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆత్రం సుగుణక్క మండిపడ్డారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, హైడ్రా విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై ఆరోపణలు చేయటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు.


తెలంగాణలో పాలనకు సంబంధించి రాహుల్ గాంధీ ప్రస్తావన తేవడం కేటీఆర్ అవివేకానికి నిదర్శనం అన్నారు. మూసీ ప్రక్షాళన విషయంలో బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మూసీ నది ప్రక్షాళన కోసం ఇంకా డిపిఆర్ రూపొందించలేదన్నారు. కానీ అప్పుడే అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై అనవసర ఆరోపణలు చేసి మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు.


మహారాష్ట్రంలో అధికారం మాదేనన్న ఆత్రం సుగుణ


మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నారు. కానీ ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను తగ్గించే ఉద్దేశంతో స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు  చేస్తున్న కుట్రను మహారాష్ట్ర ప్రజలు తిప్పి కొడతారని ఆత్రం సుగుణక్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాల్లు రాజవ్వ, సిడాం కౌసల్య, గౌరుబాయి, సరిత, వరలక్ష్మి, విజయలక్ష్మి, నీలాబాయి, అన్నపూర్ణ, జాడి మల్లు, కవిత, స్వప్న, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Also Read: Good News For Farmers: సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్, రైతుల ఖాతాల్లో జమపై ప్రభుత్వం శుభవార్త