Bhainsa Bundh: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఎమ్మెల్యే రాజసింగ్ అరెస్టును నిరసిస్తూ.. హిందూ సంఘాలు, రాజాసింగ్ అభిమానులు భైంసా బంద్ కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే  భైంసా పట్టణ వ్యాపారులు.. దుకాణ సముదాయలాను మూసివేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడంపై నిరసన వ్యక్తం చేస్తు శనివారం బంద్ ను చేశారు. ధర్మ రక్షణ కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే రాజాసింగ్ కు మద్దతుగా హిందూ సంఘాలు నిలవాలని ఆయనకు మద్దతుగా పలు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు చేశారు.


పలు సెక్షన్ల కింద కేసులు నమోదు  


ఎమ్మెల్యే రాజాసింగ్‌ను రెండు కేసుల్లో అరెస్టు చేసిన పోలీసులు.. ఆయనపై పీడీయాక్ట్ పెట్టారు. మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్‌ సహా షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లలో నమోదైన కేసులలో అరెస్టు చేశారు. ఒకరోజు ముందు  41 (ఏ) సీఆర్పీసీ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు. యూపీ ఎన్నికల సమయంలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై ఈ కేసులు నమోదు అయ్యాయి. మంగళ్‌హట్‌ పీఎస్‌లో 68/2022 క్రైమ్‌ నంబర్‌ కేసులో, షాహినాయత్‌గంజ్‌ పీఎస్‌లో క్రైమ్‌ 71/2022లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 19, 2022న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మంగళ్‌హాట్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏప్రిల్‌ 12న షా ఇనాయత్‌గంజ్‌లో కేసు మరో కేసు నమోదైంది. ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల వేళ, శ్రీరామ నవమి సందర్భంగా వివాదాస్పద కామెంట్స్ చేశారని ఈ ఫిర్యాదులు అందాయి. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 153(A), 295(A), 504, 505(2) కేసులు రిజిస్టర్ చేశారు. ఈ కేసులకు సంబంధించి సీఆర్‌పీసీ-41(A) కింద నోటీసులు రాజాసింగ్‌కు ఇచ్చారు. 


మనోభావాలను కించపరిచారని


రాజాసింగ్ ను కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు పోలీసులు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమైంది. ముందు ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో  పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. రెండోసారి మాత్రం పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేశారు. 


పీడీ యాక్టు అంటే ఏంటంటే?


పీడీ చట్టం అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్. సమాజంలో అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు, విధ్వంసాలు చేసేవారు మీద ఈ చట్టం కింద 3 నుంచి 12 నెలలపాటు జైళ్లో పెట్టవచ్చు. చట్టం ముఖ్య ఉద్దేశ్యం సమాజాన్ని రక్షించడం. సాధారణంగా పీడీ యాక్ట్‌ను దొంగతనాలకు.. అల్లర్లకు పాల్పడే రౌడీషీటర్ల మీద మాత్రమే అమలు చేస్తారు. రాజకీయ నాయకులపై ఇలాంటివి ప్రయోగించడం అసాధారణం. అయితే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో ఆయన  సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 


Also Read : Praja Samgrama Yatra : ముగిసిన బండి సంజయ్ పాదయాత్ర, జేపీ నడ్డాతో కలిసి భద్రకాళి అమ్మవారి దర్శనం


Also Read : TS BJP Cine Glamour : తెలంగాణ బీజేపీకి స్టార్ అట్రాక్షన్ ! పిలిస్తే తిరస్కరించే ధైర్యం ఎవరికైనా ఉందా !?