Chakirevu Village : ఆహాలో ప్రసారమైన బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చారు. పవన్ ఎపిసోడ్ లో నిర్మల్ జిల్లా పెంబి మండలం చాకిరేవు గ్రామం గురించి బాలకృష్ణ ప్రస్తావించారు. ఈ గ్రామ సమస్యలు తెలుసుకొని 'ఆహా' వారు సోలార్ ఎనర్జీని అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు చాకిరేవు గ్రామాభివృద్ధికి రూ.లక్ష చెక్కును అందించారు. గ్రామాభివృద్ధికి సహకరించినందుకు ఆహా వారికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాను కూడా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పర్యటించానని, అక్కడి ఆదివాసుల కష్టసుఖాలు తెలుసని అన్నారు. ఆదివాసీలు ప్రకృతి ఒడిలో జీవిస్తున్నారని, ఆహా వారు చాకిరేవు గ్రామానికి సోలార్ ల్యాంప్స్ తో పాటు గ్రామాభివృద్ధికి లక్ష రుపాయలు అందించినందుకు అభినందనలు తెలిపారు. 


గ్రామానికి సోలార్ పవర్ 


చాకిరేవు గ్రామానికి ఆహా వాళ్లు సోలార్ పవర్ అందిస్తున్నట్లు అన్ స్టాపబుల్ షోలో బాలకృష్ణ ప్రకటించారు. తెలంగాణ నిర్మల్ జిల్లాలోని మారుమూల గ్రామం చాకిరేవు, ఈ ఊరికి చేరుకోడానికి దట్టమైన అటవీ ప్రాంతాన్ని దాటాల్సిఉంటుంది. వీళ్ల భాష గోండు. ఈ గ్రామంలో కేవలం 70 మంది మాత్రమే ఉన్నారు. వీళ్లకు సోలార్ పవర్ అందించేందుకు ఆహా ముందుకు వచ్చింది. దీంతో ఆ గ్రామస్థుల ఆనందం వ్యక్తం చేశారు. ఆదివాసీలు అతితక్కువ వసతులతో జీవిస్తారని పవన్ అన్నారు. ఆ ప్రాంతాల్లో తాను పర్యటించానన్నారు. ఆదివాసీల జీవనశైలి మెరుగుపర్చేందుకు కృషి చేస్తానన్నారు. చాకిరేవు గ్రామానికి సోలార్ లైట్స్ ఏర్పాటు చేస్తున్న ఆహాకు అభినందనలు తెలిపారు. 


గత ఏడాదే మంచినీళ్లు 


చాకిరేవు గ్రామ సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది మార్చి నెలలో నిర్మల్‌ జిల్లా కేంద్రానికి ఏకంగా 75 కి.మీ. పాదయాత్ర చేశారు చాకిరేవు గ్రామస్తులు. తమ గ్రామానికి మంచినీటి సదుపాయం లేదని పాదయాత్రగా కలెక్టరేట్ వద్దకు వచ్చి ఆందోళన చేశారు. దీంతో ఆ గ్రామాన్ని కలెక్టర్‌ సందర్శించి రెండు బోర్లు వేయించారు. అలాగే మిగతా సమస్యలను తీరుస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అప్పట్లో గ్రామస్థులు ఆందోళన విరమించారు. నీళ్లు, రోడ్డు, కరెంటు లేక ఏళ్లుగా అవస్థలు పడుతున్న తమకు అన్ని సౌకర్యాలు కల్పించాలని పెంబి మండలంలోని చాకిరేవు గ్రామస్తులు కలెక్టరేట్‌కు పాదయాత్రగా వచ్చిన ఆందోళన చేశారు. గ్రామ సమస్యలు పరిష్కరించాలని టెంట్‌ వేసుకుని నిరసన తెలిపారు.  ఆదివాసీల పాదయాత్ర అప్పట్లో కథనాలు వచ్చాయి. దీంతో మంత్రులు స్పందించి కలెక్టర్‌ కు ఆదేశాలు ఇచ్చారు. అధికారుల బృందం చాకిరేవు గ్రామానికి వెళ్లారు. పునరావాసానికి చాకిరేవు గ్రామస్థులు ఒప్పుకోకపోవడంతో అక్కడే తాగునీరు, కరెంటు, రోడ్డు సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు మూడు బోర్లు వేయించగా, రెండింటిలో నీళ్లు పడినట్లు గ్రామస్థులు తెలిపారు.  కలెక్టర్‌ తమ ఊరికి వచ్చి వెళ్లిన తర్వాత నుంచి అధికారులు వస్తున్నారని చాకిరేవు గ్రామస్థులు హార్షం వ్యక్తం చేస్తున్నారు.  సమస్యలు తీర్చేదిశగా అడుగులు పడుతుండటంతో  గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.