Minister Indrakaran Reddy : రైతుల ప‌ట్ల కేంద్ర ప్రభుత్వ తీరు దారుణంగా ఉందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతులు, పేద ప్రజ‌ల పాలిట శాపంగా మారాయన్నారు. వ్యవ‌సాయ క‌ల్లాల‌కు ఉపయోగించిన ఉపాధి హామీ నిధులు వెనక్కి ఇవ్వమ‌న‌డం స‌రికాదన్నారు. వెంట‌నే ఆ నిర్ణయాన్ని కేంద్రం వెన‌క్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖ‌రికి నిర‌స‌గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చేప‌ట్టే ధర్నా కార్యక్రమాల‌ను జయప్రదం చేయాలని  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. 


రైతు వ్యతిరేక విధానాలు


కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై  రైతులు, సామాన్య ప్రజలు పోరాడాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి పిలుపునిచ్చారు. క‌ల్లాల నిర్మాణం పూర్తయ్యాక, వ్యవ‌సాయ క‌ల్లాల‌కు ఉపాధి హామీ నిధులు ఇవ్వననడం స‌రికాదన్నారు. వెంట‌నే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల‌ని మంత్రి డిమాండ్ చేశారు. రైతుల‌కు న‌ష్టం చేసేలా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని బీర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా  వ్యతిరేకిస్తుంద‌న్నారు. తెలంగాణ రాష్ట్ర రైతన్నల కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ ప్రెసిడెంట్ తారక రామారావు ఆదేశాలతో కేంద్రం అవలంభిస్తున్న రైతు, వ్యవ‌సాయ కూలీల‌ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో చేప‌ట్టే ధర్నా కార్యక్రమాల్లో రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. రేపు(శుక్రవారం) నిర్మల్ ప‌ట్టణంలో నిర్వహించే ధ‌ర్నాలో తాను కూడా పాల్గొనున్నట్లు మంత్రి తెలిపారు.  


రైతన్నల పొట్ట కొడుతుంది కేంద్రం 


గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రిన‌గ‌ర్ క్యాంప్ కార్యాల‌యంలో మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ శక్తులకు కొమ్ము కాస్తూ, రైతాంగానికి, సామాన్య ప్రజానికి తీవ్ర నష్టం చేసే  నిర్ణయాల‌ను తీసుకుంటుంద‌ని మండిపడ్డారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా వ్యవ‌హ‌రిస్తూ... వివ‌క్ష చూపుతుంద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. జాతీయ ఉపాధి హ‌మీ ప‌థ‌కం కింద నిర్మించిన క‌ల్లాల‌కు నిధులు ఇవ్వకుండా మోకాల‌డ్డుతుంద‌ని కేంద్ర ప్రభుత్వ తీరును త‌ప్పుప‌ట్టారు. రైతుల‌కు ప్రత్యక్షంగా ఉప‌యోగ‌ప‌డే క‌ల్లాలు వ్యవ‌సాయంలో భాగం కాద‌ని  వ‌క్రభాష్యాలు చెప్పి రైతన్నల‌ను, వ్యవ‌సాయ కూలీల పొట్ట కొడుతుంద‌ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిప‌డ్డారు. రైత‌న్నలు ఆర్థికంగా బ‌లోపేతం కావాల‌ని సీఏం కేసీఆర్ ఎన్నో రైతు సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే... కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలోనే అతిపెద్దదైన వ్యవ‌సాయాన్ని రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంద‌న్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నదాత‌ల‌ను ఆదుకునేలా కేంద్రానికి ఒక్క విధానం కూడా లేదని విమర్శించారు.


మండిపడ్డ మంత్రి హరీశ్ రావు 


రైతుల కోసం కల్లాలను నిర్మించడం తప్పని కేంద్రం అంటుందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పంట పొలాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబోసుకునేందుకు కల్లాలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కల్లాలను నిర్మించడం తప్పని, కల్లాల నిర్మాణం కోసం ఖర్చు చేసిన రూ.150 కోట్లు తిరిగి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లాలు కట్టకుండా బిల్లు పెడితే తప్పు కానీ కల్లం కడితే తప్పంటేని మంత్రి ప్రశ్నించారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని నిలదీవారు. బీజేపీ ప్రభుత్వం చేపలు ఎండబెట్టుకునేందుకు పర్మిషన్‌ ఇచ్చిందని, చేపలు ఎండబెట్టుకునేందుకు కల్లాలు కడితే తప్పులేదా? అంటూ ధ్వజమెత్తారు. బీజేపీ మేనిఫెస్టెలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారని, రెట్టింపు చేయలేదు కానీ పెట్టుబడి రెట్టింపు చేశారని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.