China Covid Surge: చైనాలో కరోనా పరిస్థితి ఆందోళనగానే ఉంది: డబ్ల్యూహెచ్ఓ

ABP Desam   |  Murali Krishna   |  22 Dec 2022 02:40 PM (IST)

China Covid Surge: చైనాలో కరోనా కేసులు గణనీయంగా పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా పరిస్థితులపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన

China Covid Surge: చైనాలో ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అవ‌స‌ర‌మైన వారికి వీలైనంత త్వరగా చైనా ప్రభుత్వం వ్యాక్సిన్ ఇవ్వాల‌ని డ‌బ్ల్యూహెచ్‌ఓ కోరింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అథనోమ్ మాట్లాడారు.

చైనాలో తీవ్ర‌మైన క‌రోనా కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న‌క‌ర‌ విషయమే. అయితే ఏ స్థాయిలో వ్యాధి తీవ్ర‌త ఉన్న‌దో ఆ దేశం వెల్ల‌డించాలి. ఆసుపత్రుల్లో జ‌రుగుతున్న అడ్మిష‌న్లు, ఇంటెన్సివ్ కేర్ అవ‌స‌రాల గురించి చైనా దేశం వెల్ల‌డించాలి. వ్యాక్సిన్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేయడంపై చైనా ఫోకస్ పెట్టాలి. ఆ దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్న‌ాం. - టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్

బీభత్సం

చైనాలో కరోనా నిబంధనలను ఎత్తేసిన తర్వాత పరిస్థితులు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. పెరుగుతున్న కేసులతో చైనాలోని ఆసుపత్రులు కిటకిటలడుతున్నాయి. వచ్చే 90 రోజుల్లో చైనాలోని 60 శాతానికి పైగా ప్రజలకు కరోనా సోకే ప్రమాదం ఉందని ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫెఇగ్ల్ -డింగ్ అంచనా వేశారు.

ఎరిక్ సోమవారం ట్విట్టర్‌లో ఒమిక్రాన్ వేరియంట్ గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉందని.. అంటే వ్యాధి సోకిన వ్యక్తి నుంచి 16 మందికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలిపారు. 

చైనాలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. చైనాలో ఉన్న ప్రస్తుత ఒమిక్రాన్ వేరియంట్ ఆర్ విలువ 16గా ఉంది. వ్యాధి సోకిన ఒక్క వ్యక్తి వల్ల 16 మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. మీరు చేయాల్సిన పని ఒక్కటే.. మీరు, మీ కుటుంబం, మీ పొరుగువారు అంతా.. బైవాలేంట్ వ్యాక్సిన్ తీసుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ లక్ష్యం ఏంటంటే.. ఎవరైతే రోగాల బారిన పడాలి అనుకుంటున్నారో పడని, ఎవరైతే మరణించాలి అనుకుంటున్నారో మరణించని అని అనుకుంటుంది. "
-                                   ఎరిక్ ఫెఇగ్ల్- డింగ్, ఎపిడెమియాలజిస్ట్

90 రోజుల్లో

ఎపిడెమియాలజిస్ట్ అంచనా ప్రకారం 60 శాతానికి పైగా చైనా ప్రజలు, అంటే 10 శాతం భూ జనాభా వచ్చే 90 రోజుల్లో వైరస్‌కు గురవుతారు. మరణాల సంఖ్య మిలియన్లలోనే ఉంటుందని తెలిపారు. 

చైనా తన కరోనా కట్టడి నిబంధనలను ఇలానే సడలిస్తే మిలియన్ కంటే ఎక్కువ మంది మరణించే ప్రమాదం ఉందని ఓ అమెరికా సంస్థ పేర్కొంది. ఇన్స్టిట్యూట్ అఫ్ హెల్త్ మేట్రిక్స్ అండ్ ఎవల్యువేషన్(ఐఎచ్ఎంఇ) అనే సంస్థ తెలిపిన వివరాల ప్రకారం 2023 ఏప్రిల్ 1 వరకు చైనాలో 3,22,000 కరోనా మరణాలు సంభవించోచ్చని తెలిపింది.

ఎత్తేసింది

ప్రజలు ఒక నెలపాటు పెద్ద ఎత్తున నిరసనలు తెలపడంతో చైనా తన జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేసింది. నిబంధనలు ఎత్తివేయడంతో దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున పెరిగాయి. చైనా రాజధాని అంతా వైరస్ వ్యాపించింది. అకస్మాతుగా ఆంక్షలు సడలించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.

Also Read: Charles Sobhraj: 'బికినీ కిల్లర్' చార్లెస్ శోభ్‌రాజ్ విడుదల- వీడు మామూలోడు కాదు!

Published at: 22 Dec 2022 02:27 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.