Christmas Celebrations 2022:  క్రిస్మస్ సందడి మొదలైంది. ఎవరి స్థోమతకు తగ్గటుగా వారు జరుపుకునే ఈ వేడుకల్లో భాగంగా చర్చిలు, ఇళ్లను విద్యుత్ దీపకాంతులతో అలంకరించడం, ప్రార్థనలు చేయడం, కొత్తబట్టలు ధరించడం, శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వీటిలో క్రిస్మస్ సందడి మొదలైంది అనిపించేది మాత్రం క్రిస్మస్ ట్రీ అలంకరణతోనే. అయితే ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు, బంగారం రంగు..ఈ రంగులనే ఎక్కువగా ఉపయోగిస్తారు. అన్నిరంగులుండగా ఈ నాలుగు రంగులనే ఎందుకు ప్రత్యేకంగా వినియోగిస్తారో చూద్దాం..


ఎరుపు రంగు
క్రిస్మస్ వేడుకల్లో  ఎరుపు రంగును ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఇది బిషప్, శాంతా క్లాజ్ దుస్తుల రంగు. ఇది యేసు రక్తాన్ని , తన త్యాగాన్ని సూచించే రంగుగా విశ్వసిస్తారు. ఎరుపు..ఇతరులపట్ల ప్రేమకు చిహ్నం. ప్రేమ ఉన్నచోట ఆనందం ఉంటుంది. 


ఆకుపచ్చ రంగు
ఏసుక్రీస్తు శిలువవేసినప్పటి నుంచీ ప్రజల హృదయాల్లో ఆయన సజీవంగానే ఉన్నాడని విశ్వసిస్తారు. ఈ రంగు కూడా ప్రకృతితో ముడిపడి ఉంటుంది. శీతాకాలంలో కూడా మొక్కలు తమ రంగును కోల్పోవు కాబట్టి, రోమన్లు ​​ఈ రంగును అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అందుకే క్రిస్మస్ అలంకరణల్లో ఆకుపచ్చ రంగు ప్రత్యేకం


Also Read: భారతదేశంలో ప్రధానమైన, పురాతనమైన, అందమైన చర్చిలు ఇవే!


బంగారం రంగు
ఈ రంగు దేవుడు ప్రపంచానికి ఇచ్చిన బహుమతికి సూచన. ఈ రంగును ఉపయోగించడం వెనుకున్న ఆంతర్యం ఆనందాన్ని పంచుకోవడం. బంగారు రంగు పూర్వపు సంపదకు చిహ్నంగా భావిస్తారు...అందుకే అదృష్టాన్ని ఆకర్షించేందుకు ఇంటి అలంకరణలో ఈ రంగుని ఉపయోగిస్తారు. 


తెలుపు రంగు
శాంతి స్వచ్ఛతకు చిహ్నమైన తెలుపురంగు.. శీతాకాలంలో కురుస్తున్న మంచును కూడా సూచిస్తుంది. అందుకే క్రిస్మస్ ట్రీ అలంకరణలో తెలుపు రంగు బదులు..పత్తిని ఉపయోగిస్తారు. విశ్వాసం, జీవితంలో ప్రకాశానికి కూడా తెలుగు సూచన


Also Read: ఇంటి అలంకరణ మాత్రమే కాదు క్రిస్మస్ కి ఇలా కూడా చేయొచ్చు!


క్రిస్మస్ ట్రీ అలంకరణ వెనుకున్న ఆంతర్యం
క్రిస్మస్ ట్రీ అలంకరణ వెనుకు చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి..వాటిలో ఒకటి..ఇది..
చాలా ఏళ్ల క్రితం ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పిల్లాడి వద్ద  డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచక తన ఇంటిముందు అందమైన మొక్కను తీసి చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసుకెళతాడు. అక్కడున్నవారంతా విలువైన కానుకలతో వస్తారు. వారంతా ప్లాబో తెచ్చిన పూలకుండీ చూసి ఎగతాళి చేస్తారు. దీంతో ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ వద్ద పెడతాడు. ఆ మొక్క అప్పటికప్పుడు పెద్ద బంగారు వృక్షంలా మారిపోతుంది. దీంతో ఆ పేద బాలుడి తెచ్చిన కానుకే అందరి కంటే విలువైనది అవుతుంది. అప్పటి వరకు బాలుడిని ఎగతాళి చేసిన వారంతా తలదించుకుంటారు. అప్పటి నుంచి ఏటా క్రిస్మస్ వేడుకల్లో ట్రీ భాగమైపోయిందని చెబుతారు.


క్రిస్మస్ ని ఓ మతపరమైన పండుగగా కాకుండా ఆనందాన్ని ఇచ్చి పుచ్చుకునే వేడుకగా చూస్తే అందరూ జరుపుకోవచ్చేమో. ముఖ్యంగా ఇంటి అలంకరణ పాజిటివ్ వైబ్రేషన్స్ ని, ప్రశాంతతని ఇస్తుంది..అందుకే క్రైస్తవులు మాత్రమే కాదు ట్రీ అలంకరణ ఆసక్తి ఉన్నవారు ఎవ్వరైనా చేయొచ్చు...