Good news for liquor lovers in Telangana: తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి.  ఓ చిల్ బీర్ కొడితే ఆ మజానే వేరు. ఇలా అనుకుని వైన్ షాపుకు వెళితే అక్కడ బీర్లు దొరకని పరిస్థితి. దీంతో మందు బాబులు నిరాశగా వెనుదిగాల్సి వస్తోంది.  గత కొంత కాలంగా రాష్ట్రంలో బీర్లు దొరకడం లేదన్న ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. చాలా వరకు షాపుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.   బీర్ల కొరత ఏర్పడినట్లు గత కొంతకాలంగా తరచూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాగుదామంటే ప్రముఖ బ్రాండ్ల బీర్లు దొరకక మద్యం ప్రియులు అల్లల్లాడిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ సమస్యపై పలువురు మందుబాబులు ఎక్సైజ్ అధికారులకు వినతి పత్రాలను సమర్పించారు.  వైన్ షాపుల్లో బ్రాండెడ్  బీర్లు అందుబాటులో ఉండేలా చూడాలంటూ కోరారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త బీర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.  


కొత్త బ్రాండ్ బీర్లు ఇవే అంటూ ప్రచారం 
 రాష్ట్రంలోకి త్వరలో రాబోతున్న కొత్త బ్రాండ్ బీర్లు ఇవేనంటూ సోషల్ మీడియాలో  ఓ పోస్ట్ వైరల్ గా మారింది. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌లు సరఫరా చేసుకునేందుకు గానూ సోమ్ డిస్టిల‌రీస్ పర్మీషన్ పొందిందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.  ప్రస్తుతం వైన్ షాపుల్లో కింగ్ ఫిషర్, ఆర్‌సీ, 5000 వంటి బీర్లు అందుబాటులో ఉన్నాయి. ప‌వ‌ర్ 1000, హంట‌ర్, బ్లాక్ ఫోర్ట్, వుడ్ పీక‌ర్ వంటి పేర్లతో కొత్త బీర్లు షాపుల్లోకి అందుబాటులోకి రానున్నట్లు ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


 అయితే తాజాగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కొత్త బ్రాండ్ బీర్ల పై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న  ప్రచారాన్ని ఆయన ఖండించారు. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదని, వాటిని తాను పరిశీలించలేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనేక శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టగా.. పెండింగ్ బిల్లులు ఉన్న కంపెనీలు ఎక్కడా బీరు సరఫరా చేయలేక పోవచ్చు కానీ మద్యం కృత్రిమ కొరత లేదని మంత్రి స్పష్టం చేశారు.. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బీర్ బ్రాండ్లపై  అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.