దళితుల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దొంగ ప్రేమ కనబరుస్తున్నారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉన్నందునే దళిత బంధు పథకం తెచ్చానని నిస్సిగ్గుగా కేసీఆర్ చెప్పారని.. దాన్ని బట్టే ప్రేమ దళితులపైనా? ఎన్నికల మీదనా? అనేది తేలిపోతుందని అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో షర్మిల దళిత భేరి బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.


‘‘ఎస్సీ ఐఏఎస్‌లను కేసీఆర్‌ అవమానించారు. ఆ అవమానాలతో ఐఏఎస్‌లు ముందే రిటైర్‌ అయ్యారు. కేసీఆర్‌ సలహాదారుల్లో ఒక్క దళిత వ్యక్తి కూడా లేరు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చివరకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వలేదు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తారా? లేదా చెప్పాలి. ఈ ఏడేళ్లలో కేసీఆర్‌ ఒక్కసారి కూడా అంబేడ్కర్‌ విగ్రహానికి దండ వేయలేదు. దళితుల కోసం కేటాయిస్తున్న డబ్బులు ఎవరి చేతుల్లోకి పోతున్నాయి’’


కేసీఆర్ దురాశకు హద్దుల్లేవా
‘‘వైఎస్ హాయాంలో సిద్దిపేట జిల్లాలో భూ పంపిణీ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక కలెక్టరేట్ కట్టాలని దళితుల భూములను లాగేసుకున్నారు. రైతు వేదిక కట్టేందుకు కూడా దళితుడి భూమినే లాగేసుకున్నారు. కేసీఆర్ భూములు ఎందుకు ఇవ్వలేడు? పేదలు, దళితుల భూములే ఎందుకు లాక్కుంటున్నారు. ఇప్పుడు భూ బ్యాంకులు పెడుతున్నారు. వేల ఎకరాలు జమ చేయడమే భూ బ్యాంకు. పెద్ద దొర కేసీఆర్, చిన్న దొర కేటీఆర్ ఇలా భూములను జమ చేసి తమ బినామీలకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. మీరు ఎంత భూమి స్వాహా చేస్తే మీ కడుపు నిండుతుందో చెప్పండి? మీ దురాశకు హద్దుల్లేవా? ఏం చేయాలనుకుంటున్నారు తెలంగాణను? దళితులకు భూములు ఇవ్వాలంటే.. భూసేకరణ ఉండాలి కదా? ఆ దిశగా ప్రయత్నాలు జరగడం లేదు.’’


800 రెట్లు అధికంగా దళితులపై దాడులు
‘‘కేసీఆర్ సీఎం కాకముందు దళితులపై సంవత్సరానికి 270 దాడులు జరిగితే, కేసీఆర్ సీఎం అయ్యాక దళితులపై జరిగిన దాడులు 800 రెట్లు పెరిగాయి. నేరెళ్ల ఘటనలో ఏం జరిగిందో మీరంతా చూశారు. భువనగిరిలో దళిత మహిళను పోలీసులు హత్య చేశారు. ఆసిఫాబాద్‌లో దళిత మహిళను అత్యాచారం చేసి చేతి వేళ్లు నరికేశారు. అయినా కేసీఆర్ నోరు మెదపడం లేదు. ఎందుకు కేసీఆర్ నోరు మెదపట్లేదు? గుండె రాయిగా మారిందా? మత్తుతో మెదడు మొద్దుబారిపోయిందా?’’


ఖబడ్దార్ కేసీఆర్
‘‘డబ్బులేని వారు చదువుకోవాలని వైఎస్ ఫీజు రీఎంబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు పేదింటి బిడ్డలు చదువుకోవద్దని ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఆపేశాడు కేసీఆర్. మెస్ బిల్లులు ఇవ్వట్లేదు. ఖబడ్దార్ కేసీఆర్... నీ దొర పోకడలు ఇక సాగనివ్వను. మీ పాలనకు చావు డప్పు కొట్టే రోజు త్వరలోనే ఉంది.’’ అని షర్మిల తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.


ఎన్నికలపైనే ప్రేమ
‘‘హుజూరాబాద్‌లో ఉప ఎన్నికలు ఉన్నాయని దళిత బంధు పెడుతున్నానని కేసీఆర్ నిస్సిగ్గుగా చెప్పాడంటే.. ఈయనకు ప్రేమ ఉన్నది దళితుల మీదనా? ఎన్నికల మీదనా? అనేది అక్కడే తేలిపోతుంది. ఒక్కో దళిత కుటుంబానికి కేసీఆర్ రూ.60 లక్షలు బాకీ ఉన్నాడు. ఎలాగంటే.. మూడెకరాల భూమి, దానిపై వచ్చే పంట మొత్తం కలిపితే రూ.60 లక్షలు అవుతుంది. మీలో ఎవరికైనా దళిత బంధు కింద రూ.10 లక్షల సాయం అందిందా? రూ.10 లక్షలు ఇస్తే తీసుకోండి. అలాగే మిగతా డబ్బులు కూడా ముక్కు పిండి వసూలు చేస్కోండి. డబ్బులకు బదులు ఒక ఉద్యోగం ఇస్తే ఓ కుటుంబం స్థిరపడుతుంది. కళ్లముందే 1.9 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అందులో 35 వేల మంది దళితులకు ఉద్యోగాలు వస్తాయి. అదే జరిగితే రాబోయే తరాలు ఎంతో బాగుంటాయి.’’ అని షర్మిల ప్రసంగించారు.


‘‘దళితులకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచింది. మొన్న మందక్రిష్ణ మాదిగ ఇంటికి వెళ్లా. ఇప్పటిదాకా ఎస్సీ వర్గీకరణ జరగలేదని.. మీ నాన్న ఉంటే జరిగిపోయేది అని ఆయన అన్నారు. దానికోసం పోరాటం చేస్తున్న మందక్రిష్ణ అన్నకు నా ధన్యవాదాలు. మాకు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు చెబుతున్నా. వైఎస్ బిడ్డగా మేం పార్టీ పెట్టి 100 రోజులు కూడా కాలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని మాటిస్తున్నా. దళిత ఉప కులాలందరికీ రిజర్వేషన్ ప్రయోజనాలు అందించడమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం’’ అని షర్మిల హామీ ఇచ్చారు.


కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన ఆరు నెలలకే ఆయన పాలన నచ్చక బయటికొచ్చిన ప్రజా గాయకుడు ఏపూరి సోమన్నను తుంగతుర్తి అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. తుంగతుర్తి ప్రజల కోసం సోమన్న పని చేస్తాడని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హామీ ఇస్తుంది.