Munugode Bypoll News: మునుగోడు ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేసిన స్వతంత్రులకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు టీఆర్ఎస్ పార్టీని కలవరపాటుకు గురి చేస్తున్నాయి. కొన్ని గుర్తులు కారు గుర్తును పోలి ఉండడంతో తమకు రావాల్సిన ఓట్లు చీలతాయని నేతలు ఆందోళన చెందుతున్నారు. తమ ఎన్నికల గుర్తు కారును పోలిన సింబల్స్‌ను ఇతరులకు కేటాయించ వద్దని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలివ్వాలని కోరుతూ టీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు వేసింది. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేస్తుంది. 


పిటిషన్‌లో టీఆర్ఎస్ వివరాల ప్రకారం.. ‘మునుగోడు ఉప ఎన్నికలో కారును పోలిన గుర్తులు ఇవ్వ వద్దని ఈ నెల 10న ఈసీని కలసి విజ్ఞప్తి చేశాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. ఈవీఎంలో స్టాంప్‌ పరిమాణంలో ఉండే కారును పోలిన గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడతారు. రోడ్‌ రోలర్‌ గుర్తును ఎవరికీ కేటాయించబోమని ఈసీ 2011లో ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ఆ గుర్తును కేటాయించింది. 


మభ్యపెడుతున్న రోడ్డు రోలర్ గుర్తు!


2018లో రోడ్డు రోలర్‌ గుర్తుకు జహీరాబాద్‌లో ఏకంగా 4330 ఓట్లు వచ్చాయి. ఇక్కడ సీపీఐకి 1,036 ఓట్లే పోలయ్యాయి. డోర్నకల్‌లో రోడ్డురోలర్‌కు 4,117 ఓట్లు, సీపీఐకి 1,361 ఓట్లు, మునుగోడులో రోడ్డు రోలర్‌కు 3,569 ఓట్లు, బీఎస్పీకి 743 ఓట్లు వచ్చాయి. దీనికి కారణం రోడ్‌ రోలర్‌ గుర్తు కారును పోలి ఉండటమే. మరికొన్ని చోట్ల ఇదే కారణంగా కెమెరాకు 3 వేల నుంచి 9 వేల ఓట్లు.. టీవీకి 2 వేల నుంచి 3 వేల ఓట్లు వచ్చాయి. ఇలాంటి గుర్తులను కేటాయిస్తే టీఆర్‌ఎస్‌ నష్టపోయే అవకాశం ఉందని పిటిషన్ లో వివరించింది. 


ఉప ఎన్నికలో నామినేషన్ల ఉపసంహరణ తరువాత అభ్యర్థులకు ఎన్నికల అధికారులు సోమవారం రాత్రి గుర్తులను కేటాయించారు. కొందరు అభ్యర్థులు టీఆర్‌ఎస్, బీజేపీలను ఇరకాటంలో పెట్టే గుర్తులను ఎంచుకోవడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది. కారు గుర్తును పోలి ఉన్న డోజర్, రోడ్డు రోలర్‌లను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో వాటిని జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. వాటిని ఎవరికీ కేటాయించవద్దని టీఆర్‌ఎస్‌ నేతలు చండూరులోని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వద్ద సోమవారం రాత్రి ధర్నాకు దిగారు. గత అనుభవాల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌కు చెందిన కారు గుర్తును పోలి ఉన్న గుర్తులను ఎవరికీ కేటాయించవద్దని, వాటిని జాబితా నుంచి తొలగించాలని కోరారు.


దుబ్బాకలోనూ అంతే..


గతంలో దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ ఇలాంటి సమస్యనే ఎదుర్కొంది. కొంత మంది స్వతంత్రులకు కేటాయించిన చపాతీ పీట, కర్ర, రోడ్‌రోలర్‌ గుర్తులు కారు గుర్తును పోలి ఉండడం టీఆర్ఎస్ కు నష్టం చేకూర్చిందని భావించారు. ఇప్పుడు మునుగోడులో గెలుపు అంత్యంత ఆవశ్యకం అయిన నేపథ్యంలో అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలని టీఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటోంది.