Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకొని హస్తం పార్టీకి ఓటు వేయమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన చండూరు మండలం కొండాపురం, గుండ్రపల్లి, బంగారిగడ్డ గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మునుగోడు నియోజక వర్గంలో 12 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని.. ఏనాడు ఆడ బిడ్డకు ఏ పార్టీ సీటు ఇవ్వలేదని అన్నారు. ఈ సారి సోనియా గాంధీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతికి టికెట్ ఇచ్చారని అన్నారు.  ఆమెను కడుపులో పెట్టి ఆశీర్వదించాల్సిన బాధ్యత మీది అని రేవంత్ రెడ్డి తెలిపారు. 


2014లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, 2018లో రాజగోపాల్ రెడ్డి గెలిచి వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారని, నియోజక వర్గానికి చేసిందేమీ లేదని విమర్శించారు. మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, మద్యం ఎవరూ పోసినా తన్నండని మహిళలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్ నేత, చలమళ్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకే ఆ పార్టీల మధ్య పోలరైజేషన్


మునుగోడులో టీఆర్ఎస్ – బీజేపీ కలిసి బెంగాల్ ప్రయోగం చేయబోతున్నాయని అన్నారు. అమిత్ షా ఆదేశాలతో సీఆర్పీఎఫ్ దిగబోతోందని పేర్కొన్నారు. బీజేపీ కోసం సీఆర్పీఎఫ్ – టీఆర్ఎస్ కోసం రాష్ట్ర పోలీసులు పని చేయబోతున్నారని ఆరోపించారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు వ్యవస్థలు ఉద్రిక్తతలు సృష్టించి... రెండు పార్టీల ఎన్నికల పోలరైజేషన్ కోసం పని చేయబోతున్నాయంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు ఈ రెండు పార్టీల మధ్య పోలరైజేషన్ కు కుట్ర పన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 


'కేసీఆర్ సెంటిమెంట్ రాజేయబోతున్నారు'


కేసీఆర్ ఢిల్లీలో... మోడీ, షా ఉపదేశం తీసుకుని వస్తున్నారంటూ చెప్పుకొచ్చారు రేవంత్. ఎన్నికల సంఘ కార్యాలయం ముందు బైఠాయించి... సెంటిమెంట్ రాజేయబోతున్నారని వివరించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల ముందు కూడా రఘునందన్, ఈటెలను ఉరేయబోతున్నట్టు హడావుడి చేశారని... ఆ ఇద్దరు గెలిచాక వాళ్లపై కేసులు కాకులు ఎత్తుకెళ్లాయని తెలిపారు. మునుగోడులో సైతం ఆ ఇద్దరి మధ్యనే పోలరైజేషన్ ఉందని... ఇద్దరూ కలిసే ఉద్రిక్తతలు సృష్టించి కుట్ర చేయబోతున్నారని పేర్కొన్నారు. కార్యకర్తలు, మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండి... ఈ కుట్రను తిప్పి కొట్టాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 


రాజ్యాంగ బద్ధ సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం, ఎన్నికల అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. బ్యాలెట్ లో పేర్లు పొందుపరిచే విషయంలో.. మునుగోడు రిటర్నింగ్ అధికారి నాలుగో స్థానంలో ఉండాల్సిన టీఆరెస్ ను రెండో స్థానంలో ఉంచారని ఆరోపించారు. జాతీయ పార్టీల అభ్యర్థులు ముందుంచి తరువాత ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల పేర్లు పెట్టాలని తెలిపారు. టీఆర్ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదని... అభ్యర్థి టీఆర్ఎస్ తరఫునే నామినేషన్ వేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్ పై తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామన్నారు. బ్యాలెట్ పేపర్ ను పరిశీలించి మార్పు చేయాలని సూచించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం సీరియల్ నెంబర్ కేటాయించాలని చెప్పారు. ఎన్నికల నియామవళి ప్రకారం అనుమతి లేని వాహనాలు సీజ్ చేయాలన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ర్యాలీల్లో అనుమతి లేని వాహనాలు తిరుగుతున్నారన్నారు.