Yadadri Darsini Buses: యాదాద్రికి వెళ్ళే భక్తుల సౌకర్యం కోసం తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) శుభవార్త అందించింది. ‘యాదాద్రి దర్శిని’ పేరుతో టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్టకు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉప్పల్ నుండి యాదాద్రికి ప్రత్యేక ఆర్టీసీ మినీ బస్సులను ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ కలిసి బుధవారం ప్రారంభించారు. యాదాద్రి ఆలయం ప్రారంభమైన నేపథ్యంలో భక్తుల సౌకర్యార్ధం యాదాద్రి కొండపైకి యాదాద్రి దర్శిని పేరుతో ఈ బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 100 మినీ బస్సులను అందుబాటులోకి తెచ్చారు.


ప్రతి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ శివారులోని ఉప్పల్ సర్కిల్ వ‌ద్దకు బ‌స్సులు నడుస్తాయని, అక్కడి నుంచి మినీ బ‌స్సుల్లో యాదాద్రికి వెళ్లవచ్చని సజ్జనార్ చెప్పారు. అంతేకాక, ఉప్పల్ సర్కిల్ వద్దకు రాని జిల్లాల బస్సులు కూడా ఉంటాయి కాబట్టి, జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచి కూడా బస్సులను నడుపుతారని అన్నారు. జేబీఎస్ నుంచి యాదాద్రికి రూ.100, ఉప్పల్ నుంచి మినీ బస్సులో అయితే రూ.75 టికెట్ రేటు ఉంటుంద‌ని తెలిపారు. ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణికులు సౌక‌ర్యవంతంగా యాదాద్రి చేరుకోవ‌చ్చని అన్నారు.


ఛార్జీలు పెంచలేదు: బాజిరెడ్డి గోవర్థన్
ఆర్టీసీ ఛార్జీల పెంపు జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ స్పందించారు. ప్రభుత్వానికి పెరిగిన సెస్ చార్జీలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపు కాదని.. సెస్ చార్జీలు మాత్రమే పెంచామని అన్నారు. టోల్ ప్లాజా డబ్బులు టీఎస్ ఆర్టీసీ మాత్రమే చెల్లిస్తుందని అన్నారు. ఏటా 70 నుండి 100 కోట్ల వరకూ ఆర్టీసీ నష్టపోతోందని.. ఆర్టీసీ లాభాల కోసమే గతంలో చార్జీల పెంచామని అన్నారు. ఇంత చేసినా రోజు రూ.6 కోట్ల దాకా నష్టపోతున్నామని అన్నారు.


తెలంగాణ ఆర్టీసీలో ఖాళీగా ఉద్యోగాల భర్తీపై సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (TSRTC MD) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) కోసం మొత్తం 2 వేల మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారని సజ్జనార్‌ (VC Sajjanar) వెల్లడించారు. వీఆర్‌ఎస్‌ కోసం ఉద్యోగులను ఎవరినీ యాజమాన్యం బలవంతం చేయట్లేదని అన్నారు. ఎంతమంది ఉద్యోగులు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోరుకుంటున్నారనే దాన్ని బట్టి, ఆ సంఖ్య ఆధారంగా ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ప్రభుత్వంతో మాట్లాడి ప్యాకేజీ సిద్ధం చేసుకుంటామని.. వీఆర్‌ఎస్‌ తేల్చాక ఆర్టీసీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని సజ్జనార్‌ విలేకరులతో చెప్పారు.