Kothagudem: వన్యప్రాణులను వేటాడేందుకు వెళ్లి విద్యుత్‌ తీగలకు తగిలి మృత్యువాత పడిన సునీల్‌ మృతదేహం ఎట్టకేలకు లభించింది. నాలుగు రోజుల పాటు పోలీసులు చేసిన విచారణ ఎట్టకేలకు సత్పలితాలను ఇచ్చింది. తాము పెట్టిన విద్యుత్‌ తీగలకు ఓ వ్యక్తి మృత్యువాతపడటంతో తమపై కేసు అవుతుందని భావించిన వారు ఏకంగా మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారిన ఈ సంఘటనకు సంబందించిన వివరాలిలా ఉన్నాయి.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం సన్యాసీబస్తీకి చెందిన మల్లెల సునీల్‌కుమార్, పాత కొత్తగూడెంకు చెందిన వెంకయ్య, రుద్రంపూర్‌కు చెందిన లావుడ్యా మున్నాలాల్‌ గత కొద్ది రోజులుగా పెనుబల్లి అటవీ ప్రాంతంలో తుపాకులతో వన్యప్రాణులను వేటాడేవారు. అదే తీరులో అటవీప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు పెనుబల్లి అటవీప్రాంతానికి వెళ్లారు. వీరు వేటకు వెళ్లిన ప్రాంతంలో వన్య ప్రాణులను వేటాడుతున్న ఇతర వ్యక్తులు విద్యుత్‌ వైర్లను అమర్చారు. ఈ విషయాన్ని గమనించకుండా ముందు వెళుతున్న వెంకయ్య విద్యుత్‌ వైర్‌ను తాకాడు.


వెంకయ్య కిందపడిపోతుండటంతో ఆయనను కాపాడేందుకు సునీల్‌కుమార్‌ పట్టుకునేందుకు ప్రయత్నించి విద్యుత్‌ వైర్‌పై పడిపోయాడు. దీంతో కరెంట్‌ షాక్‌తో సునీల్‌కుమార్‌ మృతి చెందాడు. తమతో వేటకు వచ్చిన వ్యక్తి కరెంట్‌షాక్‌తో మృతి చెందడంతో ఆందోళన చెందిన వెంకయ్య, మున్నాలాల్‌లు బయటకు వచ్చి టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ పోలీసులు విషయం ఉన్నతాధికారులకు చెప్పి డాగ్‌ స్క్వాడ్‌ను తెప్పించి అడవిలో గాలింపు చేపట్టారు.
సినిమా ట్విస్టులను తలపించేలా..
పోలీసులు అటవీ ప్రాంతానికి చేరుకున్న సమయానికి సునీల్‌ కుమార్‌ మృతదేహం సంఘటన స్థలం వద్ద మాయం కావడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. కొత్తగూడెం డీఎస్పీ వెంకటేశ్వరబాబు, ట్రైనీ ఐపీఎస్‌ క్రాంతిలాల్‌పాటిల్‌ వెంకయ్య, మున్నాలాల్‌ను విచారించారు. అనంతరం విద్యుత్‌ ఉచ్చు అమర్చిన వాళ్లే మృతదేహాన్ని మాయం చేశారనే అనుమానంతో కొందరు అనుమానితులను విచారణ ప్రారంబించారు. పెనుబల్లి మండలానికి చెందిన ముగ్గురు వేటగాళ్లపై అనుమానితులుగా బావించి వారిని విచారణ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు చంటి అనే వ్యక్తిని విచారణకు పిలిపించడంతో భయంతో చంటి పోలీస్‌ స్టేషన్‌ నుంచి బయటకు వచ్చి పురుగుల మందు తాగడంతో గమనించిన పోలీసులు అతనిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చంటి మృతి చెందాడు. ఈ కేసు విషయంపై నాలుగు రోజులుగా పోలీసులు విచారణ మమ్మురం చేశారు. వన్యప్రాణుల వేటలో పాల్గొంటున్న వారి వివరాలు సేకరిస్తూ విచారణ ప్రారంభించారు. 
కేసుల భయంతో మృతదేహాన్ని మాయం చేసిన వేటగాళ్లు..
పోలీసులు విచారణ వేగవంతం చేయడంతో తాము ఎలాగైనా దొరికిపోతామన్న భయంతో వన్యప్రాణుల కోసం అడవిలో విద్యుత్‌ ఉచ్చులు బిగించిన మట్ట కృష్ణ, ముత్యాల రావు అనే వ్యక్తులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మృతదేహాన్ని సంఘటనా స్థలం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరం వద్దకు తీసుకెళ్లి రాళ్లలో పాతిపెట్టినట్లు ఒప్పుకున్నారు. దీంతో నిందితుల సమాచారంతో పోలీసులు అడవిలోకి వెళ్లి సునీల్‌ మృతదేహాన్ని వెలికితీశారు. వన్యప్రాణుల వేటలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం, కేసుల భయంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని మాయం చేయడం భద్రాద్రి కొత్తగూడెంలో చర్చానీయాంశంగా మారింది.