Protocol Violation in Telangana Governor Tamilisai Bhadrachalam Tour: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థ మధ్య దూరం పెరుగుతూనే ఉందనటానికి భద్రాచలం మరో వేదికగా మారింది. ఇప్పటికే గవర్నర్‌ పర్యటనలో (Telangana Governor) హెలికాప్టర్‌ లేకపోవడం చర్చానీయాంశంగా మారగా.. ఇప్పుడు గవర్నర్‌ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి (Governor Bhadrachalam Tour) వారి పట్టాభిషేకానికి హాజరుకాగా అక్కడ జిల్లా ఉన్నతాధికారులైన కలెక్టర్‌ దూరిశెట్టి అనుదీప్, ఎస్పీ సునీల్‌ దత్‌లు ఇక్కడ కనిపించకపోవడం ఇప్పుడు ఆరోపణలకు మరింత వాస్తవ రూపం దాల్చుతుంది. 
అధికారులు సెలవు పెట్టారా..?
రాష్ట్ర గవర్నర్‌ ఏదైనా జిల్లాలో పర్యటిస్తే ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లా కలెక్టర్‌తోపాటు జిల్లా ఎస్పీ ప్రొటోకాల్‌ పాటించాల్సి ఉంది. అయితే ఇద్దరు జిల్లా ఉన్నతాధికారులు సైతం ఇప్పుడు సెలవులో వెళ్లారని ప్రచారం సాగుతుంది. తమిళిసై కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే అడిషనల్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లుతోపాటు కొత్తగూడెం ఆర్డీవో స్వర్ణలత ఆమెకు స్వాగతం పలికారు. శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక వేడుకల్లో ఈ ఇద్దరు అధికారులు కనిపించకపోవడంతో ఇద్దరు సెలవులో ఉన్నారనే ప్రచారం సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రొటోకాల్‌ పాటించాల్సిన ఈ ఇద్దరు అధికారులు గవర్నర్‌ పర్యటనలో లేకపోవడంతో ఇప్పుడు ఈ విషయం కాస్తా చర్చానీయాంశంగా మారింది. అయితే ఇద్దరు అధికారులు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రొటోకాల్‌ పాటించకుండా సెలవుపై వెళ్లారనే ప్రచారం సాగుతుంది. దీనిని నిర్దారించేందుకు అటు జిల్లా యంత్రాంగం సంశయించడం గమనార్హం. 
ఐటీడీఏ పీవో కూడా..
గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ (Governor Tamilisai Sounderarajan) రెండు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని దమ్మపేటలో ఆమె గిరిజనులతో కలవనుంది. గిరిజనులకు సంబంధించిన సంక్షేమ పథకాలు, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాలపై ఇక్కడ గిరిజనులతో నేరుగా మాట్లాడనుంది. అయితే గిరిజనుల సంక్షేమానికి సంబందించిన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు ఆఫీసర్‌ గౌతమ్‌ సైతం సెలవులో ఉన్నారని ప్రచారం సాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు ఇప్పుడు సెలవులో వెళ్లారనే ప్రచారం, గవర్నర్‌ పర్యటనకు ఈ ముగ్గురు దూరంగా ఉంటుండటంతో గవర్నర్‌ తమిళిసై (Tamilisai Sounderarajan) పర్యటనకు వీరిని ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతుంది. ఏది ఏమైనా రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మద్య ఉన్న విబేదాలు ఇప్పుడు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి సాక్షిగా మరింత బహిర్గతం అవుతున్నాయి. ఈ సంఘటనలు భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేది ఆసక్తికరంగా మారింది.