ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పంచన చేరి తెలంగాణకు ద్రోహం చేశారని, రాష్ట్ర ప్రజలు ఇది ఎన్నటికీ గుర్తుంచుకుంటారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమ్ముడుపోవడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు అలవాటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముష్టిపల్లిలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య, ఆయన అనుచరులు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 


తమ సొంత జిల్లా నల్గొండకు రావాల్సిన కృష్ణా జలాలను నాటి సీఎం వైఎస్సార్ తన సొంత జిల్లా కడపకు తరలించుకుపోతుంటే కోమటిరెడ్డి సోదరులు ఏం చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం పదవుల కోసం సోదరులిద్దరూ పెదవి విప్పలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనేది కేవలం కాంట్రాక్టుల కోసమేనని మునుగోడు ప్రజలు గమనించారని చెప్పారు. ఇలాంటి నేతల్ని నమ్ముకున్న వారికి ఏ మేలు జరగదని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇటీవల బీజేపీలో చేరడం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు.






కూసుకుంట్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి
మునుగోడు అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి నియోజకవర్గ సమస్యల గురుంచి ఒక 300 సార్లు నా దగ్గరికి వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి కూడా నిధుల కోసం రాలేదన్నారు జగదీశ్ రెడ్డి. ముష్టిపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌, టీఆర్ఎస్ మునుగోడు ఇన్‌ఛార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వరరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.






కాళేశ్వరం ప్రాజెక్టులో వెనకేసిన అవినీతి సొమ్ముతో మునుగోడు ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పటికే ప్రజలకు గోడ గడియారాలు పంచుతున్నారని, మునుగోడు ప్రజలకు ఇంటికి కిలో బంగారం ఇచ్చినా సరే టీఆర్ఎస్ ను ప్రజలు ఓడిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు భయం మొదలైందని మొన్నటి మునుగోడు సభతో తేలిపోయిందని చెప్పారు. పొలాల్లో బోర్లకు మీటర్లు పెడతారంటూ రైతులను భయపెడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనను అంతం చేయడం కోసం చేస్తున్న ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలే చివరికి విజయం సాధిస్తారని చెప్పారు.  
 Also Read: Komatireddy Rajagopal: గడియారాలు కాదు, కిలో బంగారం ఇచ్చినా ఓటమే! కేసీఆర్‌లో భయం - కోమటిరెడ్డి వ్యాఖ్యలు