మునుగోడు ఉప ఎన్నిక కోసం షెడ్యూల్ విడుదల అయిన వేళ ఇక అన్ని పార్టీలు వ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. టీఆర్ఎస్ పార్టీ మునుగోడును దక్కించుకునేందుకు భారీగా ప్లాన్ చేస్తోంది. పండగ అయిపోయిన తెల్లారి నుంచే మునుగోడులో ప్రచార హోరు మోగనుంది. టీఎర్ఎస్ శ్రేణులు, జిల్లా నేతలు, ఇంఛార్జిలు అందరూ రంగంలోకి దిగనున్నారు. అంతేకాకుండా, త్వరలో చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు. 


పక్కా ప్రచార వ్యూహంలో భాగంగా మునుగోడును టీఆర్ఎస్ పార్టీ 86 యూనిట్లుగా చేసింది. ఒక్కో యూనిట్‌కు ఒక్కో ఎమ్మెల్యేను ఇంచార్జిగా నియమించారు. అలాగే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్‌‌కు కూడా ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఒక్కో యూనిట్‌కు ఉన్న ఎమ్మెల్యేకు 20 మంది నేతలతో టీమ్‌ను ఏర్పాటు చేశారు. దసరా తర్వాతి రోజు అంటే అక్టోబర్ 6 నుంచి గడప గడపనూ చుట్టేసేలా ప్లాన్లు వేశారు. 


రేపే అభ్యర్థి ప్రకటన
మునుగోడు ఉప ఎన్నిక కోసం బీజేపీ తరపున.. రాజీనామా చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలో ఉండగా, కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని నిలబెట్టింది. కానీ, టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఏ అభ్యర్థినీ నిలబెట్టలేదు. అయితే, ఇప్పటికే అభ్యర్థి పేరును టీఆర్ఎస్ అధిష్ఠానం ఖరారు చేసింది. రేపు (సెప్టెంబరు 5) మునుగోడు అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.


వ్యూహాల కోసం కాంగ్రెస్ నేతల సమావేశం
గాంధీభవన్ లో మునుగోడు ఉప ఎన్నికల సమీక్ష సమావేశం మొదలైంది. ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్ ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో పాటు మండల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు బోయినిపల్లి లోని రాజీవ్ గాంధీ ఐడియాలోజి సెంటర్ లో భారత్ జోడో యాత్ర పై సమీక్ష సమావేశం జరుగుతుంది. ఏఐసీసీ యాత్ర నిర్వాహకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కొప్పుల రాజు, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర యాత్ర కన్వీనర్ బలరాం నాయక్ లతో పాటు రాష్ట్రంలోని ముఖ్య నాయకులు నియోజక వర్గ ఇంఛార్జిలు పాల్గొంటారు.


మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదీ
తెలంగాణలోని మునుగోడుతో పాటు దేశంలో ఖాళీ అయిన చోట్ల కూడా ఇదే తేదీల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బిహార్ లోని మోకమా, గోపల్ గంజ్, హరియాణాలోని ఆదమ్ పూర్, తెలంగాణలోని మునుగోడు, ఉత్తర్ ప్రదేశ్ లోని గోలా గోక్రన్నథ్, ఒడిశాలోని ధామ్ నగర్ నియోజకవర్గాలకు కూడా ఇదే సమయంలో ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. 


ముఖ్యమైన తేదీలు



  • ఉప ఎన్నిక గెజిట్ నోటిఫికేషన్ - అక్టోబరు 7, 2022

  • నామినేషన్లకు ఆఖరి తేదీ - అక్టోబరు 14, 2022

  • నామినేషన్ల పరిశీలన - అక్టోబరు 15, 2022

  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ - అక్టోబరు 17, 2022

  • పోలింగ్ తేదీ - నవంబరు 3, 2022

  • కౌంటింగ్ తేదీ - నవంబరు 6, 2022