తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు నాగార్జున సాగర్‌లో నల్గొండ జిల్లా నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం పార్టీలో వివాదాస్పదం అవుతోంది. మొన్నటి వరకూ కలిసినట్లుగా కనిపించిన ఇద్దరు నేతలు రేవంత్, కోమటిరెడ్డి ఈ వ్యవహారంతో మళ్లీ విభేదాలు నెలకొన్నాయి. రేవంత్ రెడ్డి సమావేశానికి తాను హాజరు కాబోనని కోమటిరెడ్డి శుక్రవారం ఉదయం కూడా తన నివాసంలో తేల్చి చెప్పేశారు. తన సొంత నియోజకవర్గంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండటం వల్ల రేవంత్‌ కార్యక్రమానికి వెళ్లడం లేదని అన్నారు. ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన కోమటిరెడ్డి.. నల్గొండ జిల్లాలో రేవంత్ సమావేశాలు అవసరం లేదని తేల్చి చెప్పారు. దీంతో అదే జిల్లాకు చెందిన పార్టీ సీనియర్లు సహా ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారు రేవంత్ సమావేశానికి వస్తారా? అనే ఉత్కంఠ నెలకొని ఉంది.


 నల్గొండ జిల్లాలో పర్యటించాలని ఈనెల 27నే తేదీ ఖరారు చేశారు. కానీ, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పటిష్ఠంగా ఉందని.. వేరే నేత వచ్చి నల్గొండలో సమీక్ష చేయాల్సిన అవసరం లేదని సంచ‌ల‌న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ఆదిలాబాద్, నిజామాబాద్‌లో సమీక్షలు పెట్టుకుంటే మంచిదని సూచించారు. దీంతో మాజీ మంత్రి జానారెడ్డి జోక్యం చేసుకున్నారు. నాగార్జున సాగర్‌‌లో రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశం ఖరారు అయ్యేలా చేశారు. నేడు (ఏప్రిల్ 29) జరిగే సమావేశానికి జానా రెడ్డి హాజరయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 


రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆయనపై తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టి టీపీసీసీ పదవి కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ ఆరోపణలే చేశారు. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక అంశంపై రేవంత్ రెడ్డికి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఇదిలా ఉండగా, కొంత కాలానికి ఇద్దరు నేతలు కలిసిపోయినట్లు కనిపించారు. స్నేహితుల్లాగా ఫోటోలకు ఫోజులివ్వడం, పార్టీ రివ్యూలు, సభల్లో సన్నిహితంగా ఉన్నారు. ఇదంతా చూసి కోమటిరెడ్డికి అసంతృప్తి పోయిందని, ఇక పార్టీ కోసం ఇద్దరూ కలిసి పని చేస్తారని అందరూ భావించారు. 


నల్గొండ జిల్లా సమావేశంతో మళ్లీ విభేదాలు
ఈ నెల 28న నల్గొండ జిల్లాలో నిర్వహించతలపెట్టిన టీపీసీసీ సన్నాహక సమావేశం మళ్లీ కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య దూరాన్ని పెంచింది. ఆ జిల్లాల్లో తాము ఎప్పటినుంచో పహిల్వాన్‌ల తరహాలో ఉన్నామని, బయటి నేత తమ జిల్లాకు రానక్కర్లేదని తేల్చి చెప్పేశారు. రేవంత్ నిర్వహించబోయే సమావేశానికి రాబోనని తేల్చేశారు. దీంతో నల్గొండ జిల్లాకు చెందిన ఇతర కీలక నేతలు రేవంత్ రెడ్డి సమావేశానికి వస్తారా? అనే అంశంపై ఆసక్తి నెలకొంది.