ఎన్నికల్లో గెలిచేందుకు నీచాతినీచమైన విధానాలను సీఎం కేసీఆర్ అనుసరిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. మునుగోడుకు ఉప ఎన్నిక వస్తే సీఎం కేసీఆర్ అన్ని రకాల హామీలు వస్తాయని అన్నారు. మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని తాను కోరుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ డ్రామాగా కొట్టిపారేశారు. మునుగోడు ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటే, వారు చెప్తే తాను రాజీనామా చేస్తానని, అవసరమైతే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని అన్నారు. వారికి ఏది మేలు జరుగుతుందో ఆ పని కోసం తన సీటును కూడా త్యాగం చేస్తానని అన్నారు. కానీ, కేసీఆర్ ప్లాన్ ప్రకారం ట్రాప్‌లో పడదల్చుకోలేదని అన్నారు. 


‘‘ఇదంతా కేసీఆర్‌ ఆడుతున్న నాటకం. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే ప్రసక్తే లేదు. నేను బహిరంగంగానే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిశాను. అమిత్‌ షాతో రాజకీయాల గురించి మాట్లాడలేదు. నేను అమిత్‌ షాను కలిసినప్పటి నుంచి సీఎం కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదు. నేను రాజీనామా చేస్తున్నట్టు టీఆర్‌ఎస్‌ అనుకూల పేపర్లలో రాయిస్తున్నారు. రాజీనామా చేస్తున్నానని, ఉప ఎన్నిక వస్తుందని ప్రచారం చేస్తున్నారు. నా రాజీనామాతో మునుగోడు అభివృద్ధి చెందుతుంది అనుకుంటే నేను రాజీనామా చేసేందుకు సిద్ధమే’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.


మునుగోడు ప్రజలు తనను గుండెల్లో పెట్టుకొని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ తరహాలో ప్రలోభాలు పెట్టినట్లుగా ఇక్కడ కుదరదని అన్నారు. మునుగోడు ప్రజలు చాలా తెలివైన వారని అన్నారు. తాను డబ్బు కోసం రంగులు, పదవుల కోసం పార్టీలు మారే రకం కాదని అన్నారు. ఇటీవల రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థికే తాను ఓటేశానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో సీఎం కేసీఆర్‌ను ఎదుర్కొనేది బీజేపీ అని తాను మాట్లాడిన మాట నిజమేనని అన్నారు.


తాను ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఎప్పుడూ వ్యతిరేకంగా వ్యవహరించలేదని అన్నారు. తనకు నిలకడ ఉంది కాబట్టే, పార్టీని వదలకుండా ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పుకొచ్చారు. పార్టీపై తనకు విశ్వాసం ఉందని అన్నారు. ‘‘రాజగోపాల్ రెడ్డి మచ్చలేని వ్యక్తి. కొంత మంది డబ్బుల కోసం, పదవుల కోసం పార్టీ మారారు. నేను పార్టీ మారాల్సి వస్తే నా మునుగోడు ప్రజలకు రెండు చేతులతో మొక్కి, వాళ్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. అంతేకానీ, కేసీఆర్ డ్రామాలతో పేపర్లతో అబద్ధాలు రాయించడం వల్ల నేను లొంగను. నేను అమిత్ షాను కలిసిన మాట వాస్తవమే, బహిరంగంగానే కలిశా’’ 


కేసీఆర్‌ను ఎదుర్కోవడం బీజేపీతోనే సాధ్యం
బీజేపీకి కేంద్రంలో అధికారం ఉంది. వాళ్లు గట్టిగా కొట్లాడితే తెలంగాణలో అధికారంలోకి రావొచ్చు. మోదీ, అమిత్ షా అనుకుంటే కేసీఆర్‌ను బొంద పెట్టొచ్చు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడింది కాబట్టి, బీజేపీతోనే అది సాధ్యం అని నేను చాలా సార్లు చెప్పాను. నా స్వార్థం కోసం నేను అలా చెప్పలేదు. నేను ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేశాను. నాకు ఎలాంటి స్వార్థం లేదు. నాజీవిత లక్ష్యమే టీఆర్ఎస్ పార్టీని ఓడించడం, నా జీవితం ఇన్‌ కంప్లీట్ గా ఉండొద్దంటే టీఆర్ఎస్ ఓడాలి. లంగా పనులు చేసి జైలులోకి వెళ్లొచ్చిన వారు మాకు నీతులు చెప్తున్నారు.


మునుగోడులోని మున్సిపాలిటీలకు వచ్చి చూడాలని, కేసీఆర్, కేటీఆర్ ను అసెంబ్లీ సాక్షిగా కోరాను. ఇప్పటిదాకా రాలేదు. కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు రూ.లక్షల కోట్లు అవినీతిగా సంపాదించుకొని, విదేశాల్లో దాచుకున్న విషయం కూడా త్వరలో బయటికి వస్తుంది. పదవిలో ఉన్న తనపై ఎన్ని ప్రలోభాలు పెట్టినా పార్టీ మారలేదు. మునుగోడులో ఉప ఎన్నిక రావాలని ముఖ్యమంత్రే కాలు దువ్వుతున్నడు. నా ప్రజల కోసం అసెంబ్లీలో నా గొంతు వినిపించా. హుజూరాబాద్‌లో ప్రలోభాలు పెట్టి ఎలాగైతే విఫలమయ్యాడో గుర్తు చేస్తున్నా.’’ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.