తెలంగాణలో పొలిటిక్స్ అనూహ్యమైన మలుపు తిరుగుతున్నాయి. ఊహించిన కాంబినేషన్స్‌ తెరపైకి వస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, కామ్రెడ్స్‌ కలుస్తున్నారన్న వార్త తెలంగాణ పొలిటికల్ సర్కిల్‌లో గుప్పుమంటోంది. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కామ్రేడ్లతో కలిసి వెళ్లాలని గులాబీ పార్టీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపిన గులాబీ నేతలు ఈ విషయంపై మరింత స్పష్టత వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉందని సమాచారం. గత అనుభవాలను చూసుకొని అసెంబ్లీలో తమ ముద్ర కనిపించేందుకు కామ్రేడ్లు సైతం కారుతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నారు. మరో నెలరోజుల్లో వీటన్నింటిపై పూర్తి క్లారిటీ రానుందని పార్టీ నేతలు చెబుతున్నారు. 


ప్రజాసమస్యలపై నిరంతరం తమ గళాన్ని వినిపించే కమ్యూనిస్టులు ప్రతిపక్షాలతోనే సయోధ్య ఉంటుంది. అయితే ఈసారి అందుకు భిన్నంగా కమ్యూనిస్టుల వ్యూహం మారుస్తున్నారని చర్చలు నడుస్తున్నాయి. తెలంగాణలో బలమైన నాయకత్వంతోపాటు ప్రతి నియోజకవర్గంలో ఎంతో కొంత పట్టున్న కామ్రేడ్లు తమతో చేయి కలిపితే మూడోసారి విజయం తథ్యమని గులాబీ నేతల ఆలోచన. అందుకే కమ్యూనిస్టుల పొత్తుతో వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.


కమ్యూనిస్టులు సైతం తమ పంథాను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికలే ఎగ్జాంపుల్‌గా చెప్పుకోచ్చు.  నాగార్జున సాగర్‌ ఎన్నికల అనంతరం కమ్యూనిస్టులు టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీతో పొత్తు పెట్టుకుంటారనే ఊహాగానాలకు ఇవి బలం చేకూరుస్తున్నాయి. సీపీఐ ఇప్పటికే వరుస ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీ నాయకులు సైతం వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందనే పేర్కొంటున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో సత్తా చాటేందుకు సీపీఐ ముందస్తు వ్యూహంలోనే సాగుతుందని తెలుస్తోంది. 


అసెంబ్లీలో తమ ప్రాతినిద్యం చూపించేందుకేనా..


తెలంగాణలో కమ్యూనిస్టుల బలం ప్రతి జిల్లాలో ఉంటుంది. ఎన్నికల్లో సొంతంగా గెలవలేకపోయినప్పటికీ గెలుపు ఓటములను నిర్దేశించే సత్తా వీరికి ఉంది. అయితే ప్రతిసారీ రాష్ట్ర అసెంబ్లీలో ప్రాతినిద్యం వహించే కమ్యూనిస్టులు 2018 ఎన్నికల్లో మాత్రం అసెంబ్లీకి తమ పార్టీ ప్రతినిధులను పంపలేకపోయారు. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో సీపీఐ భాగస్వామ్యం కాగా సీపీఎం బీఎల్‌ఎఫ్‌ పేరుతో ఒంటరిగా బరిలోకి దిగింది. అయితే ప్రతిసారీ కనీసం ఒకరో ఇద్దరో గెలిచే కమ్యూనిస్టులు ఈ ఎన్నికల్లో గెలవలేకపోయారు. అయితే ఈసారి తమ ప్రాతినిద్యాన్ని కాపాడుకునేందుకు కారు పార్టీతో జత కట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై సీపీఎం ఆచితూచి అడుగులు వేస్తునప్పటికీ సీపీఐ మాత్రం బహిరంగంగానే మద్దతు పలుకుతుంది. 2023 ఎన్నికల కోసం ముందస్తు వ్యూహం ప్రకారమే సీపీఐ స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఉపఎన్నికల్లో మద్దతు పలికింది.  


నాగార్జునసాగర్‌ నుంచి మొదలు..


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ప్రాతినిద్యాన్ని పెంచుకునేందుకు వ్యూహం మార్చిన సీపీఐ నాగార్జున సాగర్‌ ఎన్నికలతో తన వైఖరిని చెప్పకనే చెప్పింది. నాగార్జునసాగర్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి బదులుగా టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు పలికిన సీపీఐ ఆ తర్వాత జరిగిన ఖమ్మం కార్పోరేషన్‌ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుంది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం టీఆర్‌ఎస్‌కి మద్దతు పలికింది. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉంటుందనే ఆ పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు.


ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు స్థానాలు కైవసం చేసుకునేందుకు ఈ వ్యూహంతో సీపీఐ ముందుకెళుతున్నారని ప్రచారం సాగుతుంది. మాజీ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివరావుకు ఈసారి పొత్తులో భాగంగా కొత్తగూడెం సీటు కేటాయించేందుకు ఒప్పందం కూడా కుదిరిందనే ప్రచారం సాగుతుంది. సీపీఐ గతంలో ప్రాతినిద్యం వహించిన వైరా నియోజకవర్గంలో సైతం పాగా వేయాలని భావిస్తోందట. ఇదిలా ఉండగా సీపీఎంని సైతం పొత్తులతో ఏకం చేసేందుకు గులాబీ పార్టీ ప్రణాళికలు చేసినట్లు సమాచారం.