Nalgonda News: తెలంగాణ వ్యాప్తంగా ఒకే పోలీసు విధానం అమలు చేయాలని డిమాండ్ ఊపందుకుంది. ఏకంగా కానిస్టేబుళ్లే రోడ్లపైకి వచ్చి ధర్నా చేశారు. నలుగురు కానిస్టేబుళ్ల భార్యల ధర్నాతో మొదలైన ఉద్యమానికి అనూహ్యమైన మద్దతు వస్తోంది. నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబుపై కానిస్టేబుళ్లు తిరుగుబాటు చేశారు. ఆయన వెళ్లిపోయే వరకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


నాలుగు రోజులు క్రితం కొంతమంది టీజీఎస్పీ కానిస్టేబుళ్ల భార్యలు ధర్నా చేశారు. సెలవులు ఇవ్వడం లేదని ఆందోళన బాటపట్టారు. అందులో కానిస్టేబుళ్ల హస్తం ఉందని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. దీంతో తెలంగాణ స్పెషల్ పోలీస్‌లు ఆందోళనను ఉద్ధృతమైంది. టీజీఎస్పీలతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస సెలవులు ఇవ్వకుండా కుటుంబాలకు దూరం చేస్తున్నారని నిన్నటి దాకా కుటుంబం ఆందోళన చేసింది. నేడు ప్రత్యక్షంగా పోలీసులే నిరసనకు దిగారు.






తెలంగాణలో వివాదాస్పదమవుతున్న కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం స్పందించి వ్యవహారాన్ని కూల్ చేసింది. కానిస్టేబుళ్ల ఫ్యామిలీ మెంబర్స్ ధర్నాపై నల్గొండ రూరల్ ఎస్సై సైదా బాబు చేసిన కామెంట్స్‌ కాకా రేపాయి. సైదా బాబు చేసిన కామెంట్స్‌కు వ్యతిరేకంగా నల్గొండ జిల్లా అన్నేపర్తి 12వ బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళన బాటపట్టారు. బెటాలియన్ లో బందోబస్తు కోసం వెళ్లిన సైదా బాబుపై మండిపడ్డారు. సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. గో బ్యాక్ అంటూ ఆయన వెళ్లిపోయే వరకు గుంపుగా వచ్చారు.  


కానిస్టేబుళ్లంతా గుంపుగా వస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుందని గ్రహించిన ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారు. కారు వైపుగా కానిస్టేబుళ్లు వచ్చే లోపు వెళ్లిపోయారు. అయిన ఒకరిద్దరు కానిస్టేబుళ్లు కారుపై చేతులతో బలంగా కొట్టారు. అక్కడే ఉన్న ఉన్నతాధికారులు వారిని వారించారు. నల్గొండలో మొదలైన వివాదం కరీంనగర్, వరంగల్‌లో ఇలా రాష్ట్రవ్యాప్తమైంది. తమకు జరుగుతున్న సమస్యలు చెప్పుకుంటే ఎందుకు సస్పెండ్ చేశారని ప్రశ్నించారు. ఇది మరింత వివాదం కాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లపై విధించిన సస్పెన్ష్‌ను ఎత్తివేశారు. 


కానిస్టేబుళ్ల ఫ్యామిలీ మెంబర్ ధర్నా చేయడంపై ఎస్సై సైదా బాబు చేసిన కామెంట్స్ తాజా వివాదానికి కారణమయ్యాయి. ఈ వివాదంపై కానిస్టేబుళ్ల భార్యలతో మాట్లాడుతూ... అసలు టీజీఎస్పీ కానిస్టేబుళ్లను ఎవరూ పెళ్లి చేసుకోవాలని అన్నారంటూ చెబుతున్నారు. ఇదే అంశంపై కానిస్టేబుల్‌ ఎస్సైను నిలదీశారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడంతోవ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


అసభ్యకరంగా మాట్లాడిన ఎస్సైను సస్పెండ్ చేయాలని కానిస్టేబుళ్లు డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు దీనిపై స్పందించాలని కానిస్టేబుళ్లు నినాదాలు చేశారు. సెలవులపై మొదలైన వివాదం ఇప్పుడు ఇలా మరో టర్న్ తీసుకోవడం వైరల్‌గా మారుతోంది. ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కూడా పోలీసులు రోడ్లపైకి వచ్చారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  


ఇలా పోలీసులే ధర్నాలు చేయడం ఏంటని తెలంగాణలో ప్రభుత్వం ఉందా లేదా అంటూ ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా విమర్సళు బాంబులు పేలుస్తున్నాయి. కేటీఆర్ ఈ విజువల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. పరిస్థితి చూస్తుంటే తెలంగాణలో ప్రతిపక్షానికి మరో కొత్త అస్త్రం దొరికినట్టే అయింది.