ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (ఏప్రిల్ 25) మరోసారి యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ప్రస్తుతం ఎర్రవెల్లిలోని ఫాం హౌజ్‌లో ఉన్న ముఖ్యమంత్రి నేరుగా రోడ్డు మార్గం ద్వారా యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి కొండపై ఉన్న శ్రీ పర్వతవర్థిని సమేత రామలింగేశ్వర స్వామి ప్రధాన ఆలయ ఉద్ఘాటన, మహాకుంభాభిషేకం, స్పటిక లింగ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో సీఎం పాల్గొననున్నారు. అక్కడి శివాలయంలో ఈనెల 20 నుంచి మహా కుంభాభిషేక ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తొగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతీ స్వామి ఆధ్వర్యంలో ఈ ఉద్ఘాటన కార్యక్రమం జరుగుతుంది. సీఎంతో పాటు దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు చేపట్టింది.


యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ మహా కార్యక్రమం పూర్తి అయిన సంగతి తెలిసిందే. గత నెల 28న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన, మహా కుంభాభిషేకంలో సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ మహా ఘట్టంలో పాల్గొన్నారు. లక్ష్మీనరసింహ స్వామి ఆలయంతోపాటు శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా కొత్తగా ఇక్కడ నిర్మించారు.


కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ భేటీ
ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వరుస భేటీలు అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ శనివారం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం రాజకీయాల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నిన్న చాలా గంటలల పాటు సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. రాత్రి ప్రగతి భవన్‌లోనే ప్రశాంత్ కిషోర్ బస చేశారని, నేడు సైతం మరిన్ని అంశాలపై చర్చించనున్నారని సమాచారం.


మొన్నటివరకు కాంగ్రెస్ అధిష్టానంతో.. తాజాగా కేసీఆర్‌తో.. 
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్‌ (Prashant Kishor meet CM KCR at Pragathi Bhavan) మరోసారి భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం టీఆర్ఎస్‌కు విజయాన్ని అందించేంటుకు ఆయన టీమ్ ఇదివరకే ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై తన బృందంతో  సర్వే నిర్వహించారు. ఇప్పటివరకూ 30 నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్ కొన్ని రోజుల కిందట భేటీ సందర్భంగా అందించారు. మిగతా నియోజకవర్గాల్లో జరిపిన సర్వే వివరాలను సీఎం కేసీఆర్‌కు తాజాగా అందించి, సర్వే వివరాలపై చర్చించినట్లు సమాచారం. ఈ విషయాలు గమనిస్తే తెలంగాణలో కాంగ్రెస్‌కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పనిచేయదని చెప్పకనే చెప్పారు.


ఘనంగా TRS వ్యవస్థాపక దినోత్సవం..
టీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27, 2001లో ఆవిర్భవించింది. ఈ నెల  27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని ప్రశాంత్ కిషోర్‌తో కేసీఆర్ చర్చించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీని నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై తన టీమ్‌తో నిర్వహించిన సర్వే రెండో రిపోర్టును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రశాంత్ కిషోర్‌ అందించినట్లు పొలిటికల్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ప్లీనరీ తరువాత ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడం, జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకోనున్నారు, దాని పర్యవసనాలపై భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. టీఆర్ఎస్ నేతలలో సైతం ఈ ఇద్దరి భేటీలో ఏం చర్చించారనే ఆసక్తి నెలకొంది.