Munugodu BJP : మునుగోడులో ఓ వైపు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు టీఆర్ఎస్ కండువా కప్పుతూండగా.. బీజేపీ టీఆర్ఎస్ నేతలకే గాలం వేస్తోంది.  చౌటుప్పల్ ఎంపీపీ తాడురి వెంకటరెడ్డి, మాజీ జెడ్పీటీసీ, మండల టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పెద్దిటి బుచ్చి రెడ్డి, మాజీ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంది లక్ష్మా రెడ్డిలు ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. తాడూరి వెంకట్ రెడ్డి వ్యవహారం రోజంతా ఉద్రిక్తతలకు కారణం అయింది.  తాడూరి వెంకట్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం అర్ధరాత్రి కలకలం రేపింది.  తాను టీఆర్ఎస్ ను వీడుతున్న విషయం తెలుసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... పోలీసులచే అక్రమ కేసులు పెట్టిస్తున్నారని వెంకట్ రెడ్డి ఆరోపించారు.   


కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న వెంకట్ రెడ్డి 


తాడూరి వెంకటరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కూసుకుంట్ ప్రభాకర్ రెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతివాదుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ ఆహ్వానం పలికింది. ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తాను టీఆర్ఎస్ బీఫామ్ పై ఎంపీపీగా గెలవలేదని వెంకటరెడ్డి చెబుతున్నారు.   మంత్రి జగదీష్ రెడ్డి విధానం నచ్చకనే బీజేపీలో చేరామని చెబుతున్నారు.  మునుగోడు నియోజకవర్గంలోనే అతిపెద్దదైన చౌటుప్పల్ మండలం ఎంపీపీ పార్టీని వీడటం టీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారింది.  


తనను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారని వెంకట్ రెడ్డి ఆరోపణ


అయితే తనపై ఎలాంటి కేసులు లేవని, రాజకీయ కుట్రతో పోలీసులతో అరెస్ట్ చేయాలని చూశారని  వెంకట్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వెంకటరెడ్డికి బీజేపీ కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు ఈటల రాజేందర్. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటేనన్నారు.  ఎన్నికల ముందుగానీ తరువాత గానీ రెండు పార్టీలు కలిసిపోవడం ఖాయమని అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. హుజూరాబాద్ ప్రజలు చెంప చెళ్లుమనిపించినా సీఎం కేసీఆర్ కు బుద్దిరాలేదని మండిపడ్డారు. కేసీఆర్ వైఖరిపై పార్టీ నేతలకు వెగటు పుట్టి టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని అన్నారు. గులాబీ కండువాను వదిలేస్తున్న వారిపై కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు. 


సొంత పార్టీ నేతలకే వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్


సొంత పార్టీ నేతలకే వెల కడుతున్న నీచమైన పార్టీ టీఆర్ఎస్ అని ఈటల రాజేందర్ మండిపడ్డారు.  పిచ్చివేషాలు వేసి లొంగదీసుకుంటామంటే తెలంగాణ సమాజం లొంగదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయే అన్న ఈటల.. బీజేపీ కార్యకర్తలు, నాయకులు మనోనిబ్బరం కోల్పోవద్దని సూచించారు. ఇన్నేళ్లు కష్టపడి పనిచేశామని, మరో 6 నెలలు ఇలాగే కష్టపడితే అధికారం మనదే అని భరోసా ఇచ్చారు.   తెరాస ను ఎదుర్కోనే ఏకైక పార్టీ బీజేపీ. కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎన్నికల ముందో తరువాతనో కలిసిపోతాయని ఈటల జోస్యం చెప్పారు.