ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి కమ్యూనిస్టుల ప్రభావం అధికంగా ఉండేది. దీంతోపాటు కాంగ్రెస్‌ పార్టీ సైతం బలం నిరూపించుకునేందుకు కమ్యూనిస్టులతో పోటీ పడేది. కొన్ని చోట్ల కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య వైరం ఉండగా కొన్ని చోట్ల కమ్యూనిస్టు పార్టీలోని సీపీఐ, సీపీఎం పార్టీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉండేవి. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో వీరి ఆధిపత్యం కోసం తరుచూ గొడవలు జరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లేది. అయితే గత దశాబ్దం నుంచి మాత్రం రాజకీయ గొడవలు సద్దుమణగడంతో ఖమ్మం జిల్లా వ్యాపార, వాణిజ్య రంగాల్లో తెలంగాణలోని మిగిలిన నగరాలకు దీటుగా ముందుకు సాగుతుంది. అనూహ్యంగా తెల్దారుపల్లిలో టీఆర్‌ఎస్‌ నాయకుడి హత్య జరగడం మరోమారు జిల్లాలో రాజకీయంగా కలకలం రేపుతోంది. 
రాజకీయ ప్రాబల్యం కోసం హత్యలా..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల రాజకీయ ప్రాబల్యం కోసం అనేక హత్యలు జరిగాయి. రాజకీయ గొడవలకు దూరంగా ఉండాలని భావించి, కొన్ని గ్రామాల్లో అమాయక ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన సంఘటనలు ఉన్నాయి. తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్య వర్గ విభేదాలు హత్యలకు దారి తీసి ఒకప్పుడు ఏపీలోని ఫ్యాక్షన్ ప్రాంతాన్ని తలపించేది. ఈ గ్రామంలో జరిగిన రెండు హత్యలతో గ్రామం అతలాకుతలమైంది. కొణిజర్ల మండలం రామనర్సయ్య నగర్‌లో రెండు వామపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరు తరుచూ గొడవలకు కారణంగా మారింది. ఖమ్మం నగరంలో సైతం గతంలో అనేక హత్యలు జరిగాయి. కానీ గత కొంతకాలం నుంచి హత్యా రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడిందని భావిస్తున్న సమయంలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను దుండగులు దారుణంగా హత్య చేశారు. తెల్దారుపల్లిలో జరిగిన ఈ రాజకీయ హత్య ఘటన మాత్రం ఖమ్మంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసేలా తయారైంది. 
తెల్దారుపల్లి ఎందుకంత కీలకం..
ఖమ్మం రూరల్‌ మండలంలోని తెల్దారుపల్లి గ్రామం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే తెల్దారుపల్లి గ్రామంకు సంబందించి అనేక రాజకీయ కోణాలు ఉన్నాయి. సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సొంత గ్రామం కావడంతోపాటు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఈ గ్రామం సీపీఎం పార్టీకి కంచుకోటగా ఉంటుంది. అనేక దశాబ్దాలుగా ఆ పార్టీకి సంబందించిన వ్యక్తులే ఇక్కడ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులుగా ఉంటున్నారు. వేరే పార్టీ ఇక్కడ కనిపించకుండా పోయింది. 2001లో తుమ్మల అనుచరుడైన ఏగినాటి వెంకటయ్య హత్యకు గురయ్యారు. అప్పటినుంచి మళ్లీ ఈ గ్రామంలో ఇతర పార్టీలు రాలేదు.  మూడేళ్ల కిందట తమ్మినేని కృష్ణయ్య టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడం, ఆ తర్వాత జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఇక్కడ పునాదులు వేసుకుంది. రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఇప్పుడు తమ్మినేని కృష్ణయ్య హత్య జరిగినట్లు ప్రచారం సాగుతుంది. తమ్మినేని కృష్ణయ్య సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి బంధువు అయినప్పటికీ ఈ హత్య జరగడం ఇప్పుడు జిల్లాలో చర్చానీయాంశంగా మారింది. రాజకీయ హత్యలకు తావులేకుండా ప్రశాంతంగా ఉన్న పల్లెలు ఈ ఘటనతో ఉలిక్కిపడ్డాయి. ఏది ఏమైనప్పటికీ నిత్యం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ధిలో దూసుకెళుతున్న ఖమ్మం జిల్లాలో రాజకీయ హత్య మాత్రం కలవరపెడుతుంది.