Mynampalli :  వారం రోజుల పాటు మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని బీఆర్ఎస్ నేత మైనంపల్లి హన్మంతరావు ప్రకటించారు. మేడ్చల్ జిల్లా దూలపల్లిలోని ఆయన నివాసానికి ఇవాళ పెద్దఎత్తున భారాస కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.  ఆయన భవిష్యత్‌ కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన కుమారుడు రోహిత్‌కు మెదక్ అసెంబ్లీ టికెట్‌ను నిరాకరించడంతో అనుసరించాల్సిన వ్యూహాలపై అనుచరులతో మైనంపల్లి చర్చించారు.


వివాదాస్పద వ్యాఖ్యలను తగ్గించిన మైనంపల్లి


అనుచరులతో సమావేశం తర్వాత మైనంపల్లి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. జీవితంలో స్థిరపడటం అంటూ ఉండదు. చనిపోయిన తర్వాతే జీవితంలో స్థిరపడినట్లు. టిడిపి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా 8 ఏళ్లు పనిచేశా. ఆ తర్వాత భారాసలో ఉన్నా. ఏ పార్టీలో ఉన్నా.. వెన్నుపోటు పొడిచే అలవాటు నాకు లేదు. ప్రాణం పోయే వరకు మాటపైనే ఉంటా. మెదక్ ప్రజలు నాకు రాజకీయ ప్రాణభిక్ష పెట్టారు. నేనూ ఎప్పుడూ కాంగ్రెస్‌, భారాస, భాజపాను తిట్టలేదని స్పష్టం చేశారు. అంతా కలిస్తేనే తెలంగాణ సాకారమైంది. భారాసను ఏమీ అనలేదు.. పార్టీ కూడా నన్ను ఏమీ అనలేదు. మల్కాజిగిరిలో వారం రోజులపాటు అనుచరులందరినీ కలుస్తాను. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. 


బీఆర్ఎస్ పెద్ద నేత తనతో మాట్లాడారన్న మైనంపల్లి                                  


తిరుమలలో తాను చేసిన వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ పెద్ద నేత తనతో మాట్లాడారని మైనంపల్లి ప్రకటించారు.  మీడియాకు ఎక్క‌వ‌ద్ద‌ని సూచించార‌ని వెల్ల‌డించారు.  ఆ పెద్ద నేత ఎవరు అన్నది ఆయన చెప్పలేదు కానీ..  కేసీఆర్ అయి ఉంటారని భావిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ హైకమాండ్ సిద్ధమయింది. మైనంపల్లికి కాకపోతే ఎవరికి టిక్కెట్ ఇవ్వాలన్నదానిపైనా కసరత్తు చేశారు. అయితే హఠాత్తుగా ఆయన కూడా సైలెంట్ అయ్యారు.  బీఆర్ఎస్ హైకమాండ్ కూడా చర్యల విషయంలో సైలెంట్ అయిపోయింది. ఈ కారణంగానే ఆయనపై చర్యలు తీసుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. 


తన కుమారుడికి పాతికేళ్లేనన్న మైనంపల్లి !                          


తన కుమారుడే తనకు ముఖ్యమని.. గతంలో వ్యాఖ్యానించిన మైనంపల్లి  తాజాగా కొద్దిగా స్వరం తగ్గించారు. అయితే నా కొడుకుకు 25 ఏళ్లు.. ఇంకా భవిష్యత్‌ ఉంది. భారత్‌లో పోటీతత్వం ఉంది.. నా కొడుకు నా కంటే ఎక్కువ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మెదక్‌లో నా కుమారుడు తిరిగి ప్రజాభిప్రాయం కోరతాడు అని ప్రకటించారు. అంటే కుమారుడి టిక్కెట్ పై వెనక్కి తగ్గినట్లేనని భావిస్తున్నారు. తాను మల్కాజిగిరిలో.. తన కుమారుడు మెదక్ లో పర్యటించిన తర్వాత వారం తర్వాత మీడియాను పిలిచి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తానని  మైనంపల్లి వెల్లడించారు.