Etela Rajender : తెలంగాణ వచ్చే వరకు సీఎం కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏంటని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. మునుగోడులో మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ కు ప్రశ్నలు సంధించారు. ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఒక ప్రాంతీయ పార్టీ రూ.864 కోట్ల పార్టీ ఫండ్ సమకూర్చుకోగలుగుతుందా అని ప్రశ్నించారు. ఎవరు ఇచ్చారు, ఎలా ఇచ్చారని నిలదీశారు.  టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లోకి ఇంత నగదు ఎలా వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.  రూ.100 కోట్లతో విమానం కొంటారట, సొమ్ము ఎవరిది సోకు ఎవరిదన్నారు. 


శవాల మీద విమానాలు కొంటావా


"తెలంగాణ తెచ్చుకున్నది పేదల బతుకులు బాగుపడతాయి అని కానీ, కేసీఆర్ వేల కోట్ల డబ్బులు సంపాదించుకోవడం కోసం కాదు. కేసీఆర్ ను గుజరాత్,ముంబయి తిరగమని కాదు తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపించింది. మూడు నెలలుగా జీతాలు లేక ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. VRAలు డెబ్బై రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. 30 మందికి పైగా చనిపోయారు. వారి శవాల మీద విమానాలు కొంటావా?  జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మీరు విమానాలు కొంటారా?"- ఈటల రాజేందర్ 


మునుగోడు అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా 
 
"ఏ క్షణంలో అయినా ఎన్నికల నోటిఫికేషన్ రావచ్చు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిన్ను ఆశీర్వదిస్తాం బిడ్డ అని మునుగోడు ప్రజలు వేచిచూస్తున్నారు. మూడున్నర సంవత్సరాల నుంచి రాజగోపాల్ రెడ్డి మునుగోడు గురించి  అసెంబ్లీలో అడిగి అడిగి అలిసిపోయారు. ఉపఎన్నిక జరిగితేనే సీఎం నిధులు ఇస్తాడు అని తేలిపోయింది కాబట్టి మునుగోడు అభివృద్ధి కోసం రాజీనామా చేశారు. నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టనీయవద్దు అని విశ్వప్రయత్నాలు చేశారు. అక్కడ దళితులు ఎక్కువమంది ఉన్నారు అని దళితబంధు ఇచ్చారు. మునుగోడులో కూడా అన్నీ రావాలంటే రాజీనామా చెయ్యాలి అని రాజగోపాల్ రెడ్డికి చెప్పా. తొలి దెబ్బకు 57 ఏళ్ల వారందరికీ పెన్షన్ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఫలితమే గిరిజనులకు 10 % రిజర్వేషన్. ఎనిమిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ నా పరిధిలో లేదు అని మాయమాటలు చెప్పారు. మరి ఇప్పుడు ఎలా ఇచ్చారు."- ఈటల రాజేందర్


33 తండాలో ఓట్ల కోసమే  


33 తండాల్లో ఉన్న ఓట్ల కోసమో లేదా మళ్లీ మోసం చేయడానికో సీఎం కేసీఆర్ గిరిజన రిజర్వేషన్ల ప్రకటన చేశారని ఈటల రాజేందర్ ఆరోపించారు.  ఓట్ల కోసమే గిరిజన బంధు తీసుకువచ్చారన్నారు. 57 ఏళ్ల పెన్షన్ తీసుకొనేవారు, గిరిజన విద్యార్థులు, గిరిజన కుటుంబాలు రాజగోపాల్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాలన్నారు.  మునుగోడులో ఉన్న ప్రతి ఇంటికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజన బంధు తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఇవ్వాలన్నారు. పేదరికానికి కులం, మతంతో  సంబంధం లేదన్న ఈటల తెలంగాణలో ఉన్న ప్రతి పేద కుటుంబానికి పేదబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  గుర్రంపోడులో గిరిజనులపై లాఠీ ఛార్చ్ చేసి హింసించారని ఆరోపించారు. గిరిజన భుముల మీద కేసీఆర్ కన్ను పడిందన్నారు. గర్భిణీలు అని కూడా చూడకుండా ఈ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు. నేనే కుర్చీ వేసుకొని పోడుభూముల సమస్య తీరుస్తా అని చెప్పిన కేసీఆర్ గిరిజనుల కళ్లల్లో మట్టి కొట్టారన్నారు.  


ఒక్క మీటరు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా 


"వ్యవసాయ కలెక్షన్ కి మీటర్లు పెడతారు అని, పాడిందే పాడరా అన్నట్టు. అబద్దాల ప్రచారం చేస్తున్నారు కేసీఆర్. హుజూరాబాద్ లో కూడా ఇలానే చేశారు. ఒక్క మీటరు అయిన చూపిస్తే ముక్కు నేలకు రాస్తా. గొర్రెల స్కీమ్ 41,700/- రూపాయలు నా దగ్గర ప్రభుత్వమే కట్టింది. ఇక్కడ కూడా ఇలానే కట్టాలి. 1.75 లక్షల రూపాయలు గొల్ల కురుమ అకౌంట్స్ లో నేరుగా వెయ్యమని డిమాండ్ చేస్తున్నాను. నేతన్నలకు ఉన్న బాకీలు అన్నీ వెంటనే చెల్లించాలి. కేంద్ర నిధులతో 15th ఫైనాన్స్ నిధుల నుంచి పనికి ఆహార పథకం నుంచి డబ్బులిస్తున్నారు తప్ప కేసీఆర్ సర్పంచులకు ఒక్క రూపాయి పనులు కూడా ఇవ్వలేదు. చేసిన పనికి బిల్లులు ఇవ్వడం లేదు. ఇప్పుడు మునుగోడులో బిల్లులు రావడానికి కారణం రాజగోపాల్ రెడ్డి ఆయన్ను మర్చిపోవద్దు.తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మద్యం ద్వారా రూ.10,700 కోట్లు ఆదాయం వస్తే, గత ఏడాది డిసెంబర్ నాటికి రూ.35 వేల కోట్లు వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో  మరో 10 వేల కోట్లు అయితే మొత్తం రూ.45 వేల కోట్లు ఆదాయం మద్యం ద్వారా వస్తుంది.  "  - ఈటల రాజేందర్