Telangana Rains | హైదరాబాద్: జూన్‌లో వర్షాలు కురవలేదని తెలుగు రాష్ట్రాల రైతులు ఆందోళన చెందారు. జులై సగం పూర్తయినా సగం వర్షాపాతం కూడా నమోదు కాలేదని తెలంగాణ ప్రభుత్వం ఇదివరకే వేరే పంటలు వేసుకోవాలని రైతులకు సూచించింది. అయితే ఈ వర్షాకాలం సీజన్‌లో తొలిసారిగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులగా భారీ వర్షాలు కుస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితుల మధ్య పలు జిల్లాల్లో వానలు పడటంతో అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. 

Continues below advertisement

బుధవారం ఈ జిల్లాల్లో వర్షాలు

వాతావరణ శాఖ సూచనల ప్రకారం... బుధవారం కూడా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం  జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. సోమవారం మధ్యాహ్నం ప్రారంభమైన వర్షం రాత్రికి తీవ్రరూపం దాల్చింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మంగళవారం ఉదయం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలతో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాలిపేరు ప్రాజెక్టు నిండగా, ములుగు, కరీంనగర్ జిల్లాల్లోని వాగుల్లో నీటి ప్రవాహంతో జలకళ వచ్చింది. 

Continues below advertisement

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు కురిశాయి. జగిత్యాల, యాదాద్రి, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ వర్షాలు కురవడంతో ఎండవేడిమి నుంచి ఉపశమనం లభించి వాతావరణం చల్లబడింది. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో 10.7 సెం.మీ, ములుగు జిల్లా వెంకటాపూర్‌లో 10.3 సెం.మీ, భూపాలపల్లి జిల్లా పెద్దంపేట్‌లో 9.2 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం జంకాపూర్‌లో అత్యధికంగా 12.2 సెం.మీ, కోటపల్లిలో 12.1 సెం.మీ, తాండూర్‌లో 11.9 సెం.మీ వర్షపాతం రికార్డయింది. చెన్నూరు మండలంలోని అక్కెపల్లి, కత్తెరశాల, సుద్దాల వాగులు ప్రవహించడంతో 2 గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే లక్షెట్టిపేటలో వేప చెట్టు కారుపై కూలడంతో వాహనం ధ్వంసం కాగా, డ్రైవర్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

Also Read: CM Revanth Reddy: హకీంపేట ఎడ్యుకేషన్ హబ్ పనుల ఆలస్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం.. అధికారులకు వార్నింగ్

ఏపీలో ఈ జిల్లాలకు వర్ష సూచన

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. ముఖ్యంగా బుధవారం ఉమ్మడి  తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. దీంతో పాటు మిగిలిన జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే అవకాశం ఉన్నందున వర్షం కురిసే సమయంలో ప్రజలు,న రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం ఏపీలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అయినా పలు జిల్లాల్లో వర్షాలు లేక భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఏపీ ప్రభుత్వం నీటి నిర్వహణపై ఫోకస్ చేసింది.