ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. తాను ఫోన్లను ధ్వంసం చేశానని ఆరోపణ చేయడాన్ని కవిత  తీవ్రంగా తప్పుపట్టారు. ఈడీ అధికారులు దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నారని, అందుకని తాను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నానని అన్నారు. అయినా ఒక మహిళ ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? అని కవిత ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ ఈడీ తాను ఫోన్లను ధ్వంసం చేశానని పేర్కొందని లేఖలో పేర్కొన్నారు. తనను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసిందని కవిత ప్రశ్నించారు. 


తనను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని అన్నారు. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే అని కవిత తీవ్రంగా తప్పుబట్టారు. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల తన రాజకీయ ప్రత్యర్థులు తనను ప్రజల్లో నిందిస్తున్నారని కవిత వాపోయారు. తద్వారా తన ప్రతిష్ఠకు తీవ్ర భంగం కలగడమే కాకుండా తన పరువును, తమ పార్టీ ప్రతిష్ఠను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని అన్నారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ లాంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరం అని కల్వకుంట్ల అన్నారు.


‘‘దురుద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లను సమర్పిస్తున్నాను. ఒక మహిళ ఫోన్ను స్వాధీనం  చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా? దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొంది. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండానే ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఈ ఆరోపణలు చేసింది? నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచింది. కానీ గత ఏడాది నవంబరులోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే. తప్పుడు ఆరోపణను ఉద్దేశపూర్వకంగా లీకేజీ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజల్లో నిందిస్తున్నారు.


‘‘తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును మా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగింది. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కి పెట్టి వ్యవహరించడం దురదృష్టకరం’’ అని లేఖ రాశారు.



నేడు మూడోసారి విచారణకు హాజరు


ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత మూడోసారి ఈడీ విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె తన కారులో తండ్రి కేసీఆర్ నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు తాను గతంలో వాడిన ఫోన్లను చూపించారు. రెండు కవర్లలో దాదాపు 10 ఫోన్లను మీడియాకు చూపించారు. ఈ కేసులో ఆధారాలు దొరక్కుండా తన ఫోన్లను కవిత ధ్వంసం చేశారని గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా విచారణకు వెళ్లే ముందు ఆ ఫోన్లు ప్రత్యేకంగా రెండు కవర్లలో వేసి చూపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ ఫోన్లకు స్టిక్కర్లు కూడా అతికించి ఉన్నాయి. ఇంటి నుంచి బయలుదేరే ముందే కాకుండా, ఈడీ కార్యాలయానికి చేరుకున్నాక, లోనికి వెళ్లే ముందు కూడా ఆ ఫోన్లు ఉన్న కవర్లను మరోసారి కవిత పైకి ఎత్తి చూపించారు.