MLC Kavitha Oxford University Speech: తెలంగాణ అభివృద్ధి మోడల్‌... దేశానికి దిక్సూచి లాంటిదని అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తెలంగాణ అభివృద్ధి మోడల్‌పై ఆమె  మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. తెలంగాణ సమ్మిళిత, సమగ్ర అభివృద్ధి  సాధించిందని వివరించారు. పరిపాలనలో మానవీయ కోణాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తున్నారని తెలిపారు కవిత. సీఎం కేసీఆర్‌ను అభినవ చాణక్యగా అభివర్ణించారామె.  అహింసా మార్గంలో తెలంగాణను సాధించిన గాంధీ అని కొనియాడారు. ఒకప్పుడు బీడువారిన భూములను పచ్చని పంటపొలాలుగా తీర్చిదిద్ది దేశానికి సీఎం కేసిఆర్  స్పూర్తినిచ్చారని అన్నారు.


ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కేసీఆర్‌తో సాధ్యమైందని... అందుకోసం సుదీర్ఘ పోరాటం సాగిందని చెప్పారు. 2001లో కేసీఆర్ తెలంగాణ పోరాటాన్ని ప్రారంభించారని.. 2004లో అప్పటి  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చిందని గుర్తు చేశారు కవిత. ఆ తర్వాత కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడంతో 2009లో  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని... చివరికి 2014లో ప్రత్యేక రాష్ట్రం సాకారమయ్యిందని వివరించారామె. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత  అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ సర్కార్‌.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాట నడిపించిందని చెప్పారు. ప్రకృతి ఇచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ ముందుందని  చెప్పారు కల్వకుంట్ల కవిత. తెలంగాణ శాంతిసామరస్యానికి ప్రతీక అని.... రాష్ట్రం ఏర్పడిన తర్వాత మతకల్లోలాలు జరగలేదని గుర్తుచేశారు. తెలంగాణ మోడల్ అంటే ఆర్థిక  గణాంకాలు కాదని... మారిన తెలంగాణ జీవన స్థితిగతులని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ  ముందుకెళ్తోందన్నారు. సీఎం కేసీఆర్.. తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపారని చెప్పారు. 


ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని 10 జిల్లాల్లో 9 వెనుకబడిన జిల్లాలుగా ఉండేవని, రైతుల ఆత్మహత్యల్లోనూ తెలంగాణ రెండో స్థానంలో ఉండేదన్నారు. 2వేల 700 మెగావాట్ల  విద్యుత్తు కొరత ఉండేదని, కరెంట్‌ సరఫరా లేక పరిశ్రమలను వారంలో రెండు రోజులపాటు మూసివేసేవారని గుర్తుచేశారు. తాగునీటి ఎద్దడి కూడా తీవ్రంగా ఉండేదన్నారు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్....  సమూలమైన సంస్కరణలు చేసి నాటి పరిస్థితులను పూర్తిగా మార్చేశారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్తు మిగులు  సాధించామని.. ధాన్యం ఉత్పత్తిలోనూ తెలంగాణ రెండో స్థానానికి చేరిందని చెప్పారు కవిత. 2014-15నుంచి 2022-23 మధ్యకాలంలో జీడీపీ 118.2 శాతం పెరగగా....  తెలంగాణ రాష్ట్ర స్థూల ఉత్పత్తి 155.7 శాతం పెరిగిందని తెలిపారు. అంటే జాతీయ సగటుకు మించి తెలంగాణ పయనిస్తోందన్నారు కవిత. జీఎస్డీపీలో దేశంలోనే తెలంగాణ  రెండో స్థానంలో ఉందని స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలోనూ ఇతర రాష్ట్రాలకు మించి తెలంగాణ దూసుకెళ్తోందన్నారు. దీన్ని భట్టి... అందరికి సమాన సందప విధానాన్ని  సీఎం కేసీఆర్ అవలంభిస్తున్నారన్నది అర్థమవుతోందని అన్నారామె. 


 తెలంగాణ వ్యవసాయం పండగలా మారిందన్నారు కల్వకుంట్ల కవిత. రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. అంతేకాదు... రైతు బంధు  పేరుతో ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ.72,815కోట్లు అందించామని చెప్పారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా  సాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆరే అన్నారు కవిత. రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్నమన్నారు. ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డులను  కంప్యూటరీకరణ చేపట్టి విప్లవాత్మక మార్పుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మిషన్ కాకతీయ కింద చెరువులకు మరమ్మత్తు చేసుకోవడం వల్ల.. రాష్ట్రంలో  చెరువులు నిండుకుండాలా ఉన్నాయని.. భూగర్భజలాలు పెరిగి మత్స్య సంపద పెరిగిందన్నారు. 


మూడున్నరేళ్లలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దుక్కుతుందన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల రైతులు మూడు  పంటలు పండిస్తున్నారన్నారు.సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాల నుంచి 2 కోట్లకుపైగా ఎకరాలకు పెరిగి.. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని  చెప్పారు కవిత. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే మరో 50 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని అన్నారు.  బలమైన విధానాలు రూపొందించడం వల్ల  ఇవన్నీ సాధ్యమయ్యాయని చెప్పారామె. 2014లో రూ.62లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ.2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుందన్నారు. తాగునీటిపై రాష్ట్ర  ప్రభుత్వం రూ.36వేల కోట్లు ఖర్చు చేసిందని... మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించామన్నారు. 2014లో 7,778 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేదని..  కానీ ఇప్పుడు 18453 మెగావాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి తెలంగాణ చేరుకుందన్నారు. పర్యావరణ సవాళ్లను అధిగమించడానికి 280 కోట్ల మొక్కలు నాటామని.. ప్రతీ  గ్రామంలో నర్సరీని నెలకొల్పామని చెప్పారు. 


పారిశ్రామికాభివృద్ధిలోనూ తెలంగాణ దూసుకెళ్తోందన్నారు కవిత. పరిశ్రమల ఏర్పాటుకు టీఎస్ ఐపాస్ విధానం ద్వారా కేవలం 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని  చెప్పారు. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ.3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22,100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని.. దీని వల్ల 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించామన్నారు. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్ బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు కూడా తమ యూనిట్లను  హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని చెప్పారు కవిత. సీఎం కేసీఆర్ దూరదృష్టితోనే ఇంత వృద్ధి సాధ్యమైందని కొనియాడారామె. వైద్య రంగంలోనూ తెలంగాణ ఎంతో  పురోగమించిందని చెప్పారు. విద్యారంగంలోనూ సమూల మార్పలు తీసుకొచ్చామని.. 10 వేల మెడికల్ సీట్లను పెంచామన్నారు. ప్రతీ జిల్లా ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్  కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు కవిత. 


మహిళా సాధికారతకు ఎంతో కృషి చేస్తున్నమని చెప్పారు కవతి. పార్లమెంటు ఆమోదించిన తర్వాత కూడా మహిళా రిజర్వేషన్ల చట్టం అమలు కావడం లేదన్నారామె. మహిళా  రిజర్వేషన్ల బిల్లు పోస్ట్ డేటెడ్ చెక్కు లాంటిదని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌... మహిళా రిజర్వేషన్ చట్టం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని  ప్రయత్నించిందని విమర్శిచారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల నుంచే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్లు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేంద్రానికి  చిత్తశుద్ధి లేదని, అన్ని పార్టీలు డిమాండ్ చేసినా ఓబీసీ కోటా కూడా కల్పించలేదని తప్పుబట్టారు కవిత.