ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. మహిళలను ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించడాన్ని సవాలు చేస్తూ గతంలో కవిత సుప్రీంలో పిటిషన్‌ వేశారు. లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని, తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జడ్జిలు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు, జస్టిస్ అరవింద్ కుమార్ బెంచ్ ఈ పిటిషన్‌పై వాదానలు విననుంది. నిన్న సుప్రీంకోర్టు కేసుల విచారణ జాబితాలో కవిత పిటిషన్‌ను పొందుపరిచారు. 


ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు  ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఈడీ మరోసారి నోటీసులు ఇవ్వడంతో... హీట్‌ పెరిగింది. తెలంగాణలోని రాజకీయ పార్టీల నేతలు కవితకు ఈడీ నోటీసులపై స్పందిస్తున్నారు. సెటర్లు వేస్తున్నారు. బీజేపీ మాత్రం.. ఈడీకి తమ పార్టీకి సంబంధం లేదని స్టేట్‌మెంట్లు ఇస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేత విజయశాంతి చేసిన ట్వీట్‌... ఆసక్తికరంగా మారింది. కవితను సపోర్ట్‌ చేస్తున్నట్టు ఆమె ట్వీట్‌ చేశారు.


కవిత అరెస్ట్ కావాలని తాము కోరుకోవడం లేదని విజయశాతం స్పష్టం చేశారు. ఆ అవసరం కూడా తమకు, తమ పార్టీకి లేదన్నారామె. కవిత అరెస్ట్ కాకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి అయినట్లు కాదని కూడా చెప్పారు. అయితే.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు వాటి విధులు అవి నిర్వర్తిస్తాయని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని ప్రచారం జరుగుతుండటంతో తమకు వ్యతిరేకంగా ఓటు పడుతుందేమో అనే భయం బీఆర్ఎస్‌లో ఉందేమో కానీ, జాతీయ పార్టీ అయిన బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదని అన్నారు. గతంలోఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఇవాళ అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆర్‌ఎస్‌ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం ఉందన్నారు. ఏదిఏమైనా.. ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు అంటూ ఆమె ట్వీట్‌ చేశారు. ఆరోపణలు ఉన్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే నిలవాలని వ్యక్తిగతంగా రాములమ్మ కోరుకుంటుందని చెప్పారు విజయశాంతి. 


శుక్రవారం లేదా శనివారం విచారణ కోసం ఢిల్లీ ఈడీ ఆఫీసుకు రావాలని ఎమ్మెల్సీ కవితకు నిన్న ఈడీ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం ఇది నాలుగో సారి. ఈ ఏడాది మార్చిలో ఆమెకు ఈడీ వరుసగా నోటీసులు జారీ చేసింది. మార్చి 16, 20, 21వ తేదీల్లో మూడు సార్లు ఆమెను వివిధ అంశాలపై  ప్రశ్నించింది. మరోవైపు గతేడాది చివరలో లిక్కర్‌ స్కామ్‌లోనే సీబీఐ కూడా కవితను హైదరాబాద్‌లోని ఆమె ఇంట్లోనే ప్రశ్నించింది. ఇప్పుడు మరోసారి ఈడీ నోటీసులు  ఇవ్వడం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇవాళ కవిత ఈడీ విచారణను హాజరుకావడంలేదని తేల్చిచెప్పారు. ఆమె లీగల్‌ టీమ్‌ను ఢిల్లీలోకి ఈడీ ఆఫీసుకు పంపుతున్నట్టు తెలుస్తోంది. 


ఈడీ నోటీసులు కాదు.. మోడీ నోటీసులు అంటూ సెటైర్‌ వేశారు ఎమ్మెల్సీ కవిత. రాజకీయ కక్షతోనే తనకు నోటీసులు పంపారని ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో మళ్లీ నోటీసులు పంపారనన్నారు. తెలంగాణ ప్రజలు ఈ నోటీసులను సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పారు. తమ లీగల్‌ టీమ్‌ ఇచ్చే సలహాను బట్టి  ముందుకు వెళ్తానన్నారు.