తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూరాబాద్ ఉపఎన్నికను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరా..? ఉపఎన్నిక వాయిదాకే మొగ్గు చూపుతున్నారా..?  తన కోరికను.. అభిప్రాయాన్ని ఆయన  ఈసీకే పరోక్షంగా పంపారా..? అంటే అనుననే చెప్పుకోవాలి. ఎందుకంటే..? 


ఎమ్మెల్సీ ఎన్నికలు  పెట్టొద్దని కేంద్ర ఈసీకి తెలంగాణ సర్కార్ లేఖ..! 


తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే కోటా స్థానాలు. వీటికి జూన్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కానీ కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. రేపోమాపో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ప్రస్తుతం ఎన్నికలు పెట్టడం సాధ్యం కాదని లేఖలో తెలిపింది.  దీనికి కారణం కరోనానే చూపించారు . రోజుకు ఆరు వందల కేసులు నమోదవుతున్నాయని ఇంకా.. పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తి కాలేదని... ఈసీకీ తెలంగాణ సర్కార్ తెలిపింది.  దీంతో ఎన్నికలు వద్దని చెప్పినట్లయింది. 


ఏకగ్రీవమయ్యే ఎన్నికలు వద్దని లేఖ రాయడం  దేనికి..?


నిజానికి అవి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు. కరోనా వచ్చేంత భారీ ఎన్నికల ఈవెంట్ కాదు. పైగా... ప్రతిపక్ష పార్టీలు పోటీ పడే పరిస్థితిలో లేవు. అంటే.. ఏకగ్రీవంగా ఎన్నికలు జరుగుతాయి. కేసీఆర్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తే వారు నామినేషన్లు వేయడం అనే ప్రక్రియ మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఎమ్మెల్సీలుగా ధృవపత్రాలు తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియలో కరోనా నిబంధులు ఉల్లంఘించడానికి .. ఉల్లంఘించే పరిస్థితులు ఏర్పడే అవకాశం కూడా లేదు. అయితే ఇప్పుడు రోజువారీగా నమోదవుతున్న ఆరు వందల కరోనా కేసుల్నే కారణంగా చెబుతూ.. తెలంగాణ సర్కార్ ఎమ్మెల్సీ ఎన్నికలు వద్దని లేఖ రాసింది. 


హుజూరాబాద్ ఉపఎన్నిక ఇప్పుడల్లా వద్దని సంకేతం పంపడమేనా..?


సింపుల్ గా అయిపోయే ఎన్నికలు కూడా కేసీఆర్ వద్దంటున్నారంటే.. ఇక హై వోల్టేజ్  లెవల్‌లో సాగుతున్న హుజూరాబాద్ ఎన్నికలను కావాలని ఆయన ఎలా కోరుకుంటారు..? ఆ ఎన్నికలు కూడా పెట్టవద్దని ఈసీకి ప్రభుత్వం తరపున పంపిన సంకేతమే ఎమ్మెల్సీ ఎన్నికలు వద్దంటూ రాసిన లేఖ అనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఆ ఎన్నికలే వద్దంటే.. ఇక వేల మంది జనంతో సంబంధం ఉన్న హూజూరాబాద్ ఎన్నికను కూడా వాయిదా వేయడానికే... ఇప్పుడల్లా నిర్వహించకుండా ఉండటానికే ఎక్కువ అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ నేతలూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 


ఎక్కువ ఉన్న ఆశావహుల్ని  సంతృప్తి  పరచలేమనే అనుకుంటున్నారా..?


అదే సమయంలో కేసీఆర్ ఒక్క లేఖ.. రెండు ఉపాయాల పద్దతిని కూడా పాటించారని అంటున్నారు. ఎందుకంటే... ఎమ్మెల్సీ స్థానాలు ఆరు ఖాళీగా ఉన్నాయి. ఆశావహులు పాతిక మందిపైనే ఉన్నారు. అందులో చాలా సీనియర్లు ఉన్నారు. ఆశలు కూడా ఎక్కువే పెట్టుకున్నారు. వారిలో కొంత మందికి ఇచ్చి కొంత మందికి ఇవ్వకపోతే...   అసంతృప్తి పెరిగిపోతుంది. అసలే రాబోయే ఎన్నికల కాలంలో నేతలు అవకాశాలు వెదుక్కోవడం ఎక్కువైంది. పైగా హుజూరాబాద్ ఉపఎన్నిక ముందు.. ఎలాంటి అసంతృప్తి స్వరాల్ని కేసీఆర్ ఆశించడం లేదంటున్నారు. అందుకే.. ఎమ్మెల్సీ ఎన్నికలు వద్దనుకుంటున్నారని అంచనా వేస్తున్నారు.