ఆయన ఎమ్మెల్యే. ఆయన ఎక్కడైనా కనబడితే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవాలనుకోవడం సహజం. అది వ్యక్తిగత సమస్య అయితే ఎమ్మెల్యే వ్యక్తిగతంగా సాయం చేస్తారు. ప్రభుత్వంతో సంబంధం ఉన్న సమస్య అయితే అధికారులతో మాట్లాడి చూస్తారు. ఏదీ చేయకూడదనుకుంటే పట్టించుకోకుండా వెళ్లిపోతారు. అయితే అందరు ఎమ్మెల్యేలు ఒకేలా ఉండరు. కొంత మంది శంకర్ నాయక్‌లా ఉంటారు. ఎందుకంటే ఆయన తనకు సాయం కావాలని వచ్చిన మహిళకు సాయం చేయడానికి తానే స్వయంగా జోలెపట్టారు. రూ. ఐదు వేలు సేకరించి ఇచ్చారు. 
 
మహబూబాబాద్ మున్సపాలిటి పరిధిలోని 26  వార్డు లోని కాకతీయ కాలనిలో  సిసి రోడ్డు నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ శిలాఫలకాన్ని ఆ విష్కరించింది  ఎమ్మెల్యే శంకర్ నాయక్. ఎమ్మెల్యే వస్తున్నారంటే సహజంగానే మున్సిపాలిటీలోనే ఉన్న ప్రముఖనేతలంతా వస్తారు. వచ్చారు.  వారితో పాటు చేతికి కట్టు కట్టుకుని ఉన్న  ఓ మహిళ కూడా వచ్చింది. కార్యక్రమం అంతా అయిపోయే వరకూ ఓపిగ్గా ఉంది. అంతా అయిపోయిన తర్వాత ఆమె ఎమ్మెల్యే  వద్దకు వెళ్లి తన దుస్థితికి చెప్పుకుంది. తన పేరు కసిరెడ్డి మధులత అని.. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యానని తెలిపింది. ఓ చేతికి దెబ్బతగిలిందని ఏ పనీ చేసుకోలేకపోతున్నానని కొంత ఆర్థిక సాయం చేయాలని కోరింది. 


మామూలుగా అయితే ఎమ్మెల్యే తన జేబులో చేయి పెట్టి  చేతికి ఎంత వస్తే అంత తీసిస్తారు.  కానీ శంకర్ నాయక్ మాత్రం జేబులో చేతులు పెట్టలేదు. పక్కన వ్యక్తి దగ్గర ఉన్న ఎర్ర తువ్వాలు తీసుకున్నారు. దాన్ని మెడలో వేసుకుని జోలె పట్టారు. మధులతకు సాయం చేయండని ఆ కార్యక్రమానికి వచ్చిన వారందర్నీ అడిగారు. వచ్చిన వారంతా తలా కొంత వేశారు. చివరికి బందోబస్తుకు వచ్చిన పోలీసులు కూడా కొంత సాయం చేశారు. మొత్తం లెక్క కడితే రూ. ఐదు వేలు అయ్యాయి. అక్కడే ఆమెకు ఇచ్చారు. అందరం సమిష్టిగా అండగా ఉండాలనే ఉద్దేశ్యం తో  జోలె పట్టి ఆడిగినట్లు ఎమ్మెల్యే తెలిపారు.  తను వ్యక్తిగతంగా కూడ సహాయం చేస్తానని ఎమ్మెల్యే  శంకర్ నాయక్ చెప్పారు..ఎప్పుడు చేస్తారో చెప్పలేదు. 


అయితే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి జోలెపెట్టి అడిగితే అందరూ కలిసి ఇచ్చింది రూ. ఐదు వేలేనా అని కొంత మంది ఆశ్చర్యపోయారు.  ఎమ్మెల్యే అంటే మరీ తక్కువగా చూస్తున్నారని ఆయన అనుచరులు కొంత ఫీలయ్యారు. శంకర్ నాయక్‌ ఇటీవల వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నారు.  హోళీ పండుగ రోజు అనుచరుల నోట్లో మద్యం పోయడం... వరి ధర్నాలో ఎంపీ కవిత వద్ద నుంచి మైక్ లాక్కోవడం వంటి చర్యలతో వివాదాస్పదమయ్యారు.