Telangana Ministers In USA : తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రులు అమెరికాలో పర్యటిస్తున్నారు.   ఐటీ పరిశ్రమల శాఖామంత్రి   దుద్ధిల్ల శ్రీధర్ బాబు , రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి   కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  అట్లాంటాలోని కోకా-కోలా హెడ్ క్వార్టర్స్ లో కంపెనీ అంతర్జాతీయ ప్రభుత్వ సంబంధాల విభాగ గ్రూప్ డైరెక్టర్ జోనథన్ రీఫ్ తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోకా-కోలా మేనేజ్ మెంట్ ను ఆహ్వానించారు. దాదాపు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులను విజువల్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ  జయేష్ రంజన్  పెట్టుబడుల శాఖ స్పెషల్ సెక్రెటరీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి ఈ ప్రజెంటేషన్ ఇచ్చారు.                      

  


ప్లాంట్ ఎక్కడ పెట్టినా సహకారం అందిస్తామన్న మంత్రులు                             


తెలంగాణలోఎక్కడ ప్లాంట్ స్థాపించినా అందుకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందేలా చర్యలు తీసుకుంటామని కోకా-కోలా ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లు హామీ ఇచ్చారు.  భారత దేశంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని, గత రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్ లో అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని మంత్రుల బృందం జోనథన్ కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పట్ల సానుకూలంగా స్పందించిన జోనథన్ హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు.               


డెల్టా ఎయిర్ లైన్స్‌తోనూ సమావేశం                              


శుక్రవారం అట్లాంటాలో డెల్టా ఎయిర్‌లైన్స్‌ సీటీవో నారాయణన్‌ కృష్ణకుమార్‌తో సమావేశమైంది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలున్నాయని, ప్రభుత్వం అన్ని రకాలుగా సౌకర్యాలూ కల్పిస్తుందని శ్రీధర్‌బాబు వివరించారు. ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేసిన కృష్ణకుమార్‌, డెల్టా ఏవియేషన్‌ టీమ్‌.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ నుంచి అట్లాంటాకు నేరుగా విమానం నడపాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.  డెల్టా ఎయిర్‌లైన్స్‌ యాజమాన్యం సానుకూలంగా స్పందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయ.         


కాంగ్రెస్ మంత్రుల పర్యటనలో కీలకంగా జయేష్ రంజన్                          


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి సారిగా  పెట్టుబడుల కోసం ప్రభుత్వ బృందం అమెరికాకు వెళ్లింది. బీఆర్ఎస్ హయాంలోనూ కీలకంగా వ్యవహిరంచిన సీనియర్ ఆఫీసర్ జయేష్ రంజన్ .. కాంగ్రెస్ హయాంలోనూ .. పెట్టుబడుల పర్యటనల విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తున్నారు.