V Srinivas Goud: నాలుక చీరేస్తాం బిడ్డా! బండి సంజయ్‌పై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు, ATM కు కొత్త అర్థాలు

ABP Desam Updated at: 06 May 2022 02:36 PM (IST)

V Srinivas Goud: టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో మాట్లాడుతున్న మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

NEXT PREV

V Srinivas Goud Press Meet: తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్రల పేరిట పచ్చబడ్డ పాలమూరును విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను ఉద్దేశించి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. ఎన్నికలు వస్తుంటే యాత్రలు మొదలయ్యాయని, మతం కులం పేరిట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ పుట్టుక నుంచే బీజేపీ ఈ ప్రాంతంపై వివక్ష ప్రదర్శిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు ఆళ్ళ వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘2000 లో మూడు రాష్ట్రాలు ఇచ్చినపుడే తెలంగాణ ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. రాష్ట్రం రాగానే పోలవరానికి ఏడు మండలాలు సీలేరు జల విద్యుత్ కేంద్రాన్ని ఏపీకి బీజేపీ కట్టబెట్టింది. సిగ్గు శరం లజ్జ లేకుండా బీజేపీ నేతలు నిన్న పాలమూరులో మాట్లాడారు. సంజయ్ నత్తితో మాట్లాడుతున్నారు. ఏం చెబుతున్నారో అర్థం కావడం లేదు. సంజయ్ ఓ బద్మాష్, వీధి రౌడీ లా మాట్లాడుతున్నారు. సంజయ్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చిన వాడేవడో. సీఎం, మంత్రులను పట్టుకుని వాడు వీడు అంటావా? నువ్వు ఎవరివి.. నీకెవరు సంస్కారం నేర్పారు. నీ ఇంట్లో నుంచి ఏమన్నా గుంజుకున్నమా? 



నడ్డాకు కనీస జ్ఞానం ఉందా? వ్యక్తిగతంగా తిడుతున్నావ్, కౌన్సిలర్ స్థాయికి కూడా బండి సంజయ్ పనికి రాడు. అసలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నవ్ సంజయ్? నాలుక చీరేస్తాం బిడ్డా.. ఆధారాలు లేకుండా సీఎం ను వాడు వీడు అని మాట్లాడతావా? పాదయాత్ర పేరిట వసూళ్లకు పాల్పడటం లేదా? కబ్జాలు చేస్తే జనం ఊరుకుంటారా సంజయ్? నడ్డా కాళేశ్వరం 20 వేల కోట్ల రూపాయలతో పూర్తయ్యేదని పచ్చి అబద్ధం మాట్లాడారు. ప్రపంచంలో ఎత్తయిన ఎత్తిపోతల పథకం 20 వేల కోట్లతో పూర్తవుతుందా అసలు నడ్డాకు కనీస జ్ఞానం ఉందా? పార్లమెంటులో తెలంగాణకు వస్తున్న ప్రశంసలు నడ్డాకు కనిపించడం లేదు. పది మంది దాకా కేంద్రమంత్రులు వచ్చి తెలంగాణ పథకాలను పొగుడుతున్నారు. మంత్రులు వస్తే మీడియాకు తెలుస్తుందని కార్యదర్శులను పంపిస్తున్నారు.- వి.శ్రీనివాస్ గౌడ్


వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఇపుడున్న సీట్లు కూడా రావు. అదృష్టంలో గెలిచి ఎంపీ అయ్యారు. సంజయ్ తీరుని చూసి బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. గతంలో దత్తాత్రేయ లాంటి నేతలు బీజేపీలో సంస్కారవంతంగా ఉన్నారు. సంజయ్.. పిచ్చిగా మాట్లాడటం ఆపకపోతే నాలుక చీరేస్తాం.. 


కాళేశ్వరం టీఆర్ఎస్‌కు ఏటీఎం అంటున్నారు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి బీజేపీకి అవన్నీ ఏటీఎంలా? బీజేపీ దేశం పాలిట ఏటీఎం అయింది. ఏటీఎం అంటే అమ్మేయడం, తాకట్టు పెట్టడం, మోదెయ్యడం. ఏటీఎం అంటే అవినీతి తాత మోదీ. ఏటీఎం అంటే ఆదానీ తొత్తు మోదీ. తెలంగాణలో రెండు ఉపఎన్నికల్లో గెలిస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందా? తెలంగాణలో కమలం వాడిపోవడమే తప్ప వికసించడం ఉండదు.


‘‘సంజయ్ కు మెంటల్ ఎక్కింది.. తక్షణమే పిచ్చాస్పత్రిలో చేర్చాలి. దమ్ముంటే ఆరోపణలు చేయడం కాదు నిరూపించు. పదేళ్ల పేపర్లు తిరగేయ్ నేను తెలంగాణ ఉద్యమంలో ఏ పాత్ర పోషించానో తెలుస్తుంది. కేసీఆర్ పులి లాంటోడు.. బీజేపీ పులి తోకను గిల్లుతోంది.. పులిని గిల్లితే ఏమవుతుంది? తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అన్నా కేసీఆర్ కు తెలంగాణ అన్న పంచ ప్రాణాలు. కేసీఆర్‌ను ఎవ్వరూ ఓడించలేరు’’ అని వి.శ్రీనివాస్ గౌడ్ విమర్శలు చేశారు.

Published at: 06 May 2022 02:36 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.