Minister KTR : సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో పింఛన్లు పదిరెట్లు పెరిగాయని మంత్రి కేటీఆర్ అన్నారు.  రాఖీ పౌర్ణమి సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో మంత్రి కేటీఆర్ జూమ్ మీటింగ్ లో మాట్లాడారు. ఆగస్టు 15 నుంచి మరో 10 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆడ బిడ్డ పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదని కల్యాణలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చామన్నారు.  తెలంగాణలో 19 లక్షల మంది తల్లులకు ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలందరి హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ వల్ల మంచినీటి సమస్య పూర్తిగా తీరిందన్నారు. నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు పింఛన్ అందిస్తున్నామని చెప్పారు.


కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు 


రాష్ట్రంలోని ప్రతీ మహిళకు ఉజ్వల భవిష్యత్తును కల్పించే పెద్దన్నగా సీఎం కేసీఆర్ భరోసాగా ఉన్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. అందుకే రాఖీ పండుగ నాడు కేసీఆర్ చిత్రపటానికి ఆడబిడ్డలంతా రాఖీకట్టాలని కోరారు. సీఎం కేసీఆర్‌ హయాంలో పెన్షన్‌ పదిరెట్లు పెరిగిందన్న కేటీఆర్, 14 లక్షల ఒంటరి, వితంతు మహిళలతో పాటు నాలుగు లక్షల మంది మహిళా బీడీ కార్మికులకు  పెన్షన్‌ ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. ఆగస్టు 15 నుంచి అర్హులైన మరో 10 లక్షల మంది కొత్తవాళ్లకు 2,016 రూపాయల చొప్పున పెన్షన్లు ఇవ్వబోతున్నామని తెలిపారు. 


మహిళా సంక్షేమంతోనే పురోగతి 


మహిళా సంక్షేమంతోనే సమాజ పురోగతి సాధ్యమని కేసీఆర్ ప్రభుత్వం నమ్ముతోందని కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మహిళల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఉద్యమకాలం నుంచి తమకు అండగా ఉన్న మహిళల ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రతకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ, వారి సంక్షేమం కోసం పనిచేస్తున్నామని తెలిపారు. గర్భిణీ స్త్రీల కోసం ప్రత్యేకంగా 300 అంబులెన్స్ లు ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం తమదే అన్నారు. అమ్మ ఒడి పథకంతో ఇప్పటి వరకు 10 లక్షల 85 వేల గర్భిణీలకు ప్రయోజనం కలిగిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇప్పటివరకు 13 లక్షల 30 వేల మంది బాలింతలకు రూ.2 వేల విలువైన కేసీఆర్‌ కిట్లు అందజేశామన్నారు. 


మాతా శిశు మరణాల తగ్గింపు 


ప్రసవం తరువాత ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా మహిళలు శారీరక శ్రమ చేయకూడదన్న ఉద్దేశ్యంతో ఆడపిల్ల పుడితే 13 వేల రూపాయలు, మగబిడ్డ పుడితే 12 వేల రూపాయలు ఇస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ కిట్స్ తో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు డెలివరీలు పెరిగాయన్నారు. మాతాశిశు మరణాల తగ్గింపులో దేశం మొత్తంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తమ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకం లో భాగంగా లక్షా నూట పదహారు రూపాయలను కట్నంగా ఇస్తుందన్నారు. తల్లిదండ్రులకు అమ్మాయి పెళ్లి భారం కావొద్దని ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం  ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ పథకం తో 12 లక్షల 87 వేల 588 మంది వధువులకు  నగదు సాయం అందించామన్నారు. 


Also Read : Munugode TRS Plan : టీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మునుగోడు ఉపఎన్నిక - ఏ వ్యూహమైనా మైనస్సేనా ?