Minister KTR Update: వర్కర్ టూ ఓనర్.. కార్మికుడ్ని ఓనర్ చేస్తాం: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్

ABP Desam Updated at: 30 Jul 2021 03:01 PM (IST)

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పెద్దూర్‌లో టెక్స్‌టైల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి వివరించారు.

శంకుస్థాపన సభలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్

NEXT PREV

చేనేత కార్మికుల మేలు కోసం తెలంగాణ ప్రభుత్వం బృహత్తర పథకాన్ని తీసుకువస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. చేనేత కార్మికులను ఓనర్లను చేసే ఉద్దేశంతో 'వర్కర్ టూ ఓనర్' పథకాన్ని తీసుకువస్తున్నట్లు చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని పెద్దూర్‌లో గోకులాస్ ఇమేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి అపేరల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల కోసం చేనేత, జౌళి శాఖ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాల గురించి మంత్రి కేటీఆర్ వివరించారు.


ఈ 60 ఎక‌రాల్లో రాబోయే రోజుల్లో రెండు, మూడు ఫ్యాక్టరీలు వ‌రుస‌గా రాబోతున్నాయి. రాబోయే 6 నెల‌ల్లో గోక‌ల్‌దాస్ కంపెనీ ప్రారంభం కాబోతుంది అని కేటీఆర్ తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో వెయ్యి మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి. అత్యధికంగా మ‌హిళ‌లకే ప్రాధాన్యం ఉంటుంది.



దేశంలో ఎక్కడా లేనంతగా పత్తి మన రాష్ట్రంలోనే పడింది. వివిధ రాష్ట్రాలకు చెందిన టెక్స్‌టైల్ సంస్థలను తెలంగాణకు ఆహ్వానిస్తున్నాం. వ‌రంగ‌ల్ కాక‌తీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్ వ‌న్ అనే సంస్థ 300 ఎక‌రాల్లో పెట్టుబ‌డులు పెడుతుంది. దీంతో 12 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు రాబోతున్నాయి. కేర‌ళ‌కు చెందిన కిటెక్స్ సంస్థ రూ.వెయ్యి కోట్ల పెట్టుబ‌డితో 4 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తూ వ‌రంగ‌ల్‌కు వ‌చ్చింది. మన దగ్గర ఉన్న నైపుణ్యానికి ఈ కంపెనీలు తోడైతే చక్కని ఉపాధి వచ్చే అవకాశం ఉంటుంది. వరంగల్, సిరిసిల్ల చేనేత హబ్‌లుగా మారుతున్నాయి. మన దగ్గర తయారు చేసే బట్టలు ప్రపంచానికే ఆదర్శం కావాలి. ఏ రాష్ట్రంలోనూ ప్రభుత్వం చేయని పనులు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో చేస్తున్నారు. త్వరలో చేనేత కార్మికులకు బీమా పథకాన్ని కూడా తెస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే ఇది అమల్లోకి వస్తుంది. నేతన్నకు చేయూత కార్యక్రమం పేరుతో 26 వేల కుటుంబాలకు రూ.110 కోట్లు ఇచ్చి వారిని ఆదుకున్నాం. కేసీఆర్ నాయకత్వంలో మరమగ్గాలు, చేనేత కార్మికులకు రుణాలు కూడా రద్దు చేశాం. వేలాది మర మగ్గాల ఆధునీకరణ కోసం రూ.వేల కోట్లు ఖర్చుపెడుతున్నాం.                                    - కేటీఆర్, మంత్రి


రైతు ఆత్మహత్యలు మన దగ్గరే తక్కువ


"దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే తక్కువని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. గతంలో వారానికి 10 మంది రైతులు ప్రాణాలు తీసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా మెరుగు పడింది. భవిష్యత్తులో ఈ పరిస్థితి ఇంకా మెరుగు పడాల్సి ఉంది."


                - కేటీఆర్, తెలంగాణ మంత్రి


వర్కర్‌ను ఓనర్ చేసేందుకే..


"వర్కర్ టూ ఓనర్ పథకంలో భాగంగా రూ.400 కోట్లకు పైగా ఖర్చు పెట్టి షెడ్ల నిర్మాణం చేస్తున్నాం. సిరిసిల్లకు 80 కిలోమీటర్ల దూరంలోనే వాటి నిర్మాణం జరుగుతోంది. కార్మికులని ఓనర్ చేసే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంతేకాక, కష్టపడి పని చేసేందుకు ఇక్కడి మహిళలు ముందుకొస్తే వారికి తగిన నైపుణ్య శిక్షణ ఇచ్చి నెలకు రూ.12 వేలకు తగ్గకుండా జీతం ఇస్తాం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. సిరిసిల్ల అపేరల్ పార్కుకు ఇప్పుడు శంకుస్థాపన జరిగింది. ఈ ప్రదేశంలో భవిష్యత్తులో 10 వేల ఉద్యోగాలు సృష్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇందుకోసం ఔత్సాహికులైన మహిళలు ముందుకు రావాలి." అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా జిల్లా అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

Published at: 30 Jul 2021 02:33 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.