Minister KTR: దేశంలో పని చేస్తున్న ఐటి ఉద్యోగుల్లో 20% మంది ఉద్యోగులు హైదరాబాద్ నుంచే పని చేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇది తెలంగాణకే గర్వ కారణం అని ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో ఆయన నిర్వహించిన సమావేశంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని 2014 లోనే చెప్పామన్నారు. గత 8 ఏళ్లుగా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటు పడుతున్నామని వివరించారు. తొలి నాళ్లలోనే ఐటీ పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవడం పైన దృష్టి సారించామన్నారు. అందుకే ప్రణాళిక బద్ధంగా హైదరాబాద్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, శాంతి భద్రతల బలోపేతంతో  పాటు ఇన్నోవేషన్ ఈకో సిస్టాన్ని మరింత అభివృద్ధి చేశామని వెల్లడించారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ టీ హబ్ ను ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 






హైదరాబాద్ ఇన్నోవేషన్ ఈకో సిస్టంలో అనేక మార్పులు వచ్చాయని... ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా వి హబ్ ని ఏర్పాటు చేశామని మంత్రి వెల్లడించారు. దానితో పాటు తెలంగాణలో ఇన్నోవేషన్ సెల్ ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ లో ప్రత్యేకంగా శానిటేషన్ హబ్ కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలో దేశంలోనే అతి పెద్ద ప్రోటో టైప్ సెంటర్ టి వర్క్స్ ప్రారంభం చేయనున్నామన్నారు. దేశానికి గర్వకారణమైన అంతరిక్ష పరిశోధనలలో పని చేస్తున్న స్కైరూట్, ధ్రువ వంటి స్టార్ట్ అప్ లు హైదరాబాద్ నుంచే ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. అంతేకాకుండా విజయవంతంగా వృద్ది చెందుతూ ముందుకు దూసుకెళ్తున్నాయన్నారు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఇన్నోవేషన్ సిస్టం బలంగా ఉందన్నారు. త్వరలో మరిన్ని స్టార్ట్ అప్స్ విజయం సాధిస్తాయన్న నమ్మకం తనకు ఉందని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 


భారత దేశంలో ఐటీ రంగంలో వచ్చిన ఉద్యోగాల సంఖ్యలో మొదటి సారి బెంగళూరు నగరాన్ని హైదరాబాద్ దాటిందన్నారు. హైదరాబాద్ సాధించిన ఈ ఘనత తనకు అత్యంత సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు. ఆఫీస్ స్పేస్  వినియోగం విషయంలో బెంగళూరుని అనేక పర్యాయాలు హైదరాబాద్ దాటినా, అత్యధికంగా ఉద్యోగాలు కల్పించిన నగరంగా నిలవడం గర్వకారణం అన్నారు. 8 సంవత్సరాల కింద తాము ప్రారంభించిన టాస్క్ (TASK) ద్వారా 7 లక్షల మందికి పైగా యువకులకు నైపుణ్య అభివృద్ధిలో శిక్షణ పొందారన్నారు. ఈ శిక్షణ కేవలం ఐటి రంగంలోనే కాకుండా లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ వంటి అనేక రంగాల్లోనూ కొనసాగిందన్నారు. రాష్ట్రంలోని పది లక్షల గృహాలకు ఇంటర్నెట్ ని అందించే టీ- ఫైబర్ ఈ సంవత్సరం పూర్తవుతందని పేర్కొన్నారు. 


హైదరాబాద్ నగరంలో ఉన్న 3000కు పైగా వైఫై హాట్ స్పాట్ ల ద్వారా అందిస్తున్న వైఫై విజయవంతం అయిందన్నారు. సమాజ హితం కోసం పనికి రాని సాంకేతిక పరిజ్ఞానం వృధా అనే సీఎం కేసీఆర్ ఆలోచన మేరకే తాము పని చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. పౌరులకు సేవలు అందించే విషయంలో దేశంలోనే తెలంగాణ మీ-సేవా అత్యుత్తమమైనదిగా ఉందని చెప్పవచ్చన్నారు. పెన్షన్లు, డ్రైవింగ్ లైసెన్స్ ల రెన్యువల్, ఈ -ఓటింగ్ వంటి అనేక ప్రభుత్వ సేవలలో పెద్ద ఎత్తున నూతన టెక్నాలజీలను ఉపయోగించుకుంటున్న  ప్రభుత్వం తమదని గర్వంగా చెప్పారు. హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులతో పాటు సోషల్ ఇన్ఫ్రా కూడా బాగా బలోపేతం అయిందన్నారు. గత 8 సంవత్సరాలుగా ఒక నగరంలో అత్యధికంగా మౌలిక వసతులు కల్పించిన నగరంగా హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంటుందని చెప్పవచ్చన్నారు. ఇప్పటికే ఎస్ఆర్డీపీ ద్వారా అనేక ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. 


త్వరలోనే హైదరాబాద్ నగరంలో సంపూర్ణ మురుగు నీటి శుద్ధి వంద శాతం జరుగుతుందని అన్నారు. ఇంతటి ఘనత దేశంలో ఏ నగరానికి లేదని చెప్పారు. 2050 వరకు హైదరాబాద్ నగర తాగు నీటి అవసరాలకు సరిపడా మౌలిక వసతులను నిర్మాణం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోతో పాటు ఎయిర్ పోర్టు మెట్రో వంటి మరిన్ని ఇతర ప్రజా రవాణా వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ ఐటీ పరిశ్రమను ఇతర ప్రాంతాలకు విస్తరించాలన్నారు. హైదరాబాద్ లోని ఇతర ప్రాంతాలతో పాటు, తెలంగాణ లోని ఇతర నగరాలకు కూడా ఐటీ పరిశ్రమ తీసుకుపోయే విషయంలో ఐటీ సంస్థలు ఆలోచన చేయాలని సూచించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో ఐటి పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన చేసిందని... పలు జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే ఐటీ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. 


అదిలాబాద్ లాంటి మారుమూల ప్రాంతాల్లోనూ ఐటీ కార్యాలయాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. వరంగల్ లో ఇప్పటికే పలు కంపెనీలు విజయ వంతంగా తమ కార్య కలాపాలను కొనసాగిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో భారత దేశంలో మరిన్ని ఐటీ ఉద్యోగాలు అందుబాటు లోకి వస్తాయని.. ఎమర్జింగ్ టెక్నాలజీల ద్వారా వచ్చే ఉద్యోగాల విషయంలో కంపెనీలు ప్రభుత్వాలతో కలిసి పని చేయాలన్నారు. తెలంగాణలోని బాసర ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థ, అక్కడున్న విద్యార్థులతో ఐటి కంపెనీలు పని చేయాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగరంలో ఎక్కడ అభివృద్ధి చేయాలో మాకు తెలుసన్నారు. ఐటీ పరిశ్రమ ఉన్న ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి చేస్తున్నామన్న మాట సరి కాదని.. భవిష్యత్ అవసరాల అనుగుణంగానే అన్ని ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల కల్పన జరుగుతుందన్నారు. హైదరాబాద్ నగరంలో 300 కిలో మీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేసే ప్రయత్నం జీహెచ్ఎంసీ చేస్తుందన్నారు.