దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని చెప్పారు మంత్రి హరీష్‌రావు. బడ్జెట్‌ 2023-24 సభలో ప్రవేశ పెట్టిన ఆయన.. తెలంగాణ అభివృద్ధిని సభకు వివరించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు రెండేళ్లలో జీఎస్డీపీ వార్షిక వృద్ధి రేటు 12 శాతం మాత్రమే ఉండేదన్నారు. ఇది జాతీ వృద్ధి రేటు 13.4 శాతం కంటే తక్కువగా ఉండేదన్నారు. పతనమైన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చాలా కఠిన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. అందుకే క్రమంగా జీఎస్డీపీ పెరుగుతూ వచ్చిందని వివరించారు. ప్రభుత్వ ఆదాయాన్ని ఆత్యధికంగా పెట్టుబడి వ్యయానికి వినియోగించడం... అభివృద్ధికి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు.


ఈ అభివృద్ధి మోడల్‌ గురించి దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ మోడల్ దేశంలోని చాలా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని కితాబు ఇచ్చారు. 2014-15 నుంచి 2019-20 వరకు రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి రేటు 13.2 శాతం పెరిగిందని గుర్తు చేశారు. అదే టైంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కేవలం 10.2 శాతం తగ్గిందని వివరించారు. 


2017-18 నుంచి 2021-22 మధ్య తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయం వృద్ధి రేటు సాధించని తెలిపారు హరీష్‌ రావు. 11. 8 శాతంతో దక్షిణాది రాష్ట్రాల్లోనే టాప్‌లో ఉందని పేర్కొన్నారు. ఇది ఇప్పటి వరకు రికార్డు విజయమని అన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నీతి ఆయోగ్‌ తన నివేదికలో పేర్కొన్నదని అన్నారు. 


దేశ జీడీపీలో చూసుకుంటే దేశంలోని 18 ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన ఫలితాలను సాధించిందని తెలిపారు. 2015-16 నుంచి 2021-22 వరకు 12.6 శాతం జీఎస్డీపీ సగటు వార్షిక వృద్ధిరేటుతో తెలంగాణ మూడో స్థానంలో ఉందని అన్నారు. 
తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రధాన రంగాల్లో, ఉప రంగాల్లో గణనీయమైన వృద్ధి సాదించిందని అన్నారు హరీష్‌రావు. ప్రథమ, ద్వితీయ, తృతీయరంగాల్లో అధిక వృద్ధి రేటు నమోదు సాధించిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంధ్యం ఏర్పడినా, దాని ప్రభావం తెలంగాణపై అంతగా లేదన్నారు. రాష్ట్రంలో వినియోగంతోపాటు అన్ని రంగాల్లో పెట్టుబడులు పెరగడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. 


తలసరి ఆదాయంలో భేష్‌
తెలంగాణలో 2013-14 సంవత్సరం 1,12, 162 రూపాయలు ఉన్న తలసరి ఆదాయం... 2022-23లో 3, 17, 115 రూపాయలకు చేరింది. ఇది జాతీయ సగటు ఇయిన 1,70, 620 రూపాయల కంటే 86 శాతం ఎక్కువ అని తెలిపారు. జాతీయ ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయం 1,46, 495 రూపాయలు ఎక్కువగా ఉందన్నారు. 


కేంద్రంపై పంచ్‌లు 
ఓ వైపు తెలంగాణ వేగంగా అభివృద్ధి సాధిస్తున్నప్పటికీ కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు హరీష్‌రావు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరంగా పూర్తి చేయడానికి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధికి లోబడే రుణాలు తీసుకొస్తున్నా కేంద్రం కొర్రీలు పెట్టిందన్నారు. ఆర్థిక వెసులుబాలు మేరకు 53, 970 కోట్లు రుణాలు తీసుకొనే ఛాన్స్ ఉన్నప్పటికీ కేంద్రం మాత్రం 15,033 కోట్లు కోత పెట్టిందన్నారు. ఆ పరిమితిని 38,937 కోట్లకు తగ్గించిందన్నారు. ఇది పూర్తిగా అసంబద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కేంద్ర ప్రభుత్వం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధంగా ఆంక్షలు పెట్టిందన్నారు. ఆర్థిక సంఘం చేసే సిఫార్సులను పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణకు 2019-20 సంవత్సరంలో ఇచ్చిన మొత్తానికి తగ్గకుండా 723 కోట్లు స్పెషల్ గ్రాంట్‌ ఇవ్వాలని 15వ ఆర్థిక సంగం చెప్పినప్పటికీ కేంద్రం ఇవ్వకుండా మొండి చెయ్యి చూపిందన్నారు. 2021-26 సంవత్సరాలకు 5,374 కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలని సిఫార్సు చేసినా... ఇవ్వకుండా అన్యాయం చేస్తుందన్నారు. 


ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రావాల్సిన పన్నుల రాయితీలు, వెనుకబడి ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టే ప్రత్యేక చర్యలు ఇంత వరకు తీసుకోకుండా ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసిందన్నారు. ఏడాదికి 450 కోట్లు చొప్పున తలంగాణకు ఇవ్వాలిసి ఉండగా మూడు సంవత్సరాలకు సంబంధించి 13,50 కోట్లు ఇవ్వనేలేదన్నారు. 


మిషన్ భగీరథకు 19,205కోట్లు, మిషన్ కాకతీయ పథకానికి ఐదువేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్‌, గిరిజన యూనివర్శిటీని స్థాపించాలని చట్టంలో ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. ఐటీఐఆర్‌ ప్రాజెక్టును కూడా వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. కృష్ణా జలాల వాటాను నిర్ణయించాలని బ్రిజేష్‌ కుమార్ ట్రైబ్యులనల్‌కు కేంద్రం సూచించవలసి ఉంది కానీ ఇంతవరకు ఆ దిశగానే చర్యలు తీసుకోలేదన్నారు. దీనివల్ల పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి, డిండీ వంటి ప్రాజెక్టులకు అంతరాయం కలుగుతుందని అన్నారు.