Telangana Kanti Velugu: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు శిబిరాలకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సాఫీగా సాగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, సంబంధిత అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి హరీష్ రావు, సీ.ఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్ సమీక్ష నిర్వహిస్తూ.. పలు సూచనలు చేశారు. ఈ నెల 18 వ తేదీన ఖమ్మంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మధ్యాన్నం ఒంటి గంటకు కంటి వెలుగు - 2 కార్యక్రమాన్ని లాంఛనంగా  ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఆ మరుసటి రోజైన 19 వ తేదీన మిగతా అన్ని జిల్లాలలో ఉదయం 9 . 00 గంటలకు కంటి వెలుగు శిబిరాలను ప్రారంభించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.






రోజుకు 120 నుంచి 130 మందికి నేత్ర పరీక్షలు చేయాలి.. 


ఎక్కడికక్కడ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను ఆహ్వానించి నిర్దేశిత ప్రాంతాల్లో శిబిరాలు ప్రారంభించాలని కలెక్టర్లకు సూచించారు. శిబిరాల వద్ద తోపులాటలు, గలాటాలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ యంత్రాంగాన్ని కోరారు. ప్రతి శిబిరం వద్ద తగు సంఖ్యలో పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. శిబిరాల వద్ద ఒకేసారి ప్రజలు గుమిగూడకుండా ప్రణాళికా బద్ధంగా,  క్రమ పద్దతిలో కంటి పరీక్షలు నిర్వహించుకునేలా కట్టుదిట్టంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతీ రోజు కనీసం 120 నుండి 130 మందికి నేత్ర పరీక్షలు చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి రోజు ఉదయం 9 . 00 గంటల నుండి సాయంత్రం 4 . 00 గంటల వరకు విధిగా శిబిరాలు కొనసాగాలని, వైద్య బృందాలు ఉదయం 8 . 45 గంటలకు, ఏ.ఎన్.ఎం లు, ఆశా కార్యకర్తలు ఉదయం 8 . 00 గంటలకే శిబిరాల వద్దకు చేరుకోవాలని ఆదేశించారు.


నాణ్యతతో కూడిన సేవలు అందిచడమే లక్ష్యంగా...


ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో, సమిష్టిగా కృషి చేయాలని మంత్రి హరీష్ రావు హితవు పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ.. మొదటి విడత కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లుగానే... అదే తరహా స్పూర్తితో ప్రస్తుతం కంటి వెలుగు - 2 కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు చొరవ చూపాలని అన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా శిబిరాల్లో నాణ్యతతో కూడిన సేవలు అందించాలని, అవసరమైన వారికి మందులు, కంటి అద్దాలను అప్పటికప్పుడే అందించాలని చెప్పారు. శిబిరాల నిర్వహణ కోసం ఇప్పటికే జిల్లాలకు నిధులు కేటాయించడం జరిగిందని, ప్రభుత్వ అభిమతానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమై ఉండాలని సూచించారు.