తెలంగాణలో గత రాత్రి (ఏప్రిల్ 25) కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలులు, వడగళ్ల వల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు భారీ ఎత్తున పంటలు నష్టపోయిన సంగతి తెలిసిందే. పంట చేతికి వచ్చి రేపో మాపో అమ్మకానికి పెడదామని ఆశతో ఉన్న రైతులు నీటిపాలైన ధాన్యం చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. అయితే, వారికి భరోసా ఇచ్చేలా ఆర్థిక మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. నోటికాడి బుక్క జారిపోయిందని ఎంతో బాధతో ఉన్న రైతులను ఓదార్చడానికి సిద్ధిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి హరీశ్ రావు తన నియోజకవర్గంలో పర్యటించారు. గ్రామాలలో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నామని హరీశ్ రావు చెప్పారు.


మంత్రి హరీశ్ రావు పంట నష్టంపై స్పందిస్తూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు రూ.10 వేలు నష్ట పరిహారం ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని హరీశ్ రావు అన్నారు. రైతులను ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని అభయం ఇచ్చారు. దేశంలో ఎక్కడా రెండు, మూడు వేలకంటే ఎక్కువ ఇవ్వడం లేదని అన్నారు. రైతులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు. ఒక్క తెలంగాణలోనే వేల కోట్లు ఖర్చు పెట్టి నాణ్యమైన విద్యుత్ ను రైతులకు అందించామని చెప్పుకొచ్చారు. ఒక్క సిద్దిపేటలోనే మొదటి దశలో 35 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు చెప్పారు. నిన్నటి వానతో నష్టం ఎంత అనే వివరాలు రావాల్సి ఉందని, దానిపై అంచనా వేస్తున్నామని చెప్పారు. 


నెల ముందుకి సీజన్ మార్చేలా ప్రణాళికలు


రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో డిసెంబర్‌లోనే వరి నాట్లు వేయడం వల్ల, కోతలు పూర్తి చేసి కొంత మంది నష్టం నుంచి బయట పడ్డారని అన్నారు. ఇక నుంచి రైతులు కూడా ఒక నెల ముందుగా నాట్లు వేసుకుంటే వడగళ్ల బాధ నుంచి తప్పించుకోవచ్చని సూచించారు. భవిష్యత్తులో ఒక నెల ముందుకు సీజన్ తెచ్చేలా రైతులకు అవగాహన కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు సూచించారు.


నివేదిక అందించాలని రెవెన్యూ అధికారులకు ఆదేశాలు


రైతులు ఆత్మ విశ్వాసం కోల్పోవద్దని, రైతుల పక్షపాతి అయిన నాయకుడు సీఎం కేసీఆర్ ఉన్నారని అన్నారు. ఇప్పటికే వడగండ్ల వాన కురిసిన ప్రాంతాల్లో మొదటి దశలో పర్యటించి దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రతీ ఎకరానికి రూ.10 వేలు ఆర్థిక సాయం అందిస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం, దుబ్బాక, తొగుట మండలాల్లో రాత్రి కురిసిన అకాల వడగండ్ల వానతో ఎంతో పంట నష్టం వాటిల్లిందని చెప్పారు. ఏ ఒక్క రైతు మిస్ కాకుండా వ్యవసాయ, రెవెన్యూశాఖ అధికారులు ఫీల్డ్ లో పర్యటించి వివరాలన్నీ ప్రభుత్వానికి వెంటనే పంపాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతుబంధు ఇచ్చి, నాణ్యమైన కరెంటు ఇచ్చి నోటి కాడికి వచ్చిన పంట జారిపోయిందని, ఈ ప్రకృతి వైపరీత్యం వడగండ్ల వాన రూపంలో చాలా నష్టం జరిగిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.