గ్రేటర్ హైదరాబాద్ మరో చరిత్ర సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్‌‌తో పాటు యావత్ దేశం, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మరోసారి హైదరాబాద్ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉంటేందుకు నేటి (సోమవారం) నుంచి కనీసం పది రోజుల పాటు మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. 


ఇప్పటి వరకు అర్హులైన వారు కూడా వ్యాక్సిన్ వేసుకోని వారి కోసం ఈ మెగా డ్రైవ్. అర్హులైన పౌరులందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి పెద్ద ఎత్తున  వాక్సినేషన్ కార్యక్రమానికి  శ్రీకారం చుట్టింది. వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, కంటోన్మెంట్ బోర్డు‌లు ఉమ్మడిగా ఈ వ్యాక్సిన్ ఉద్యమాన్ని చేపట్టాయి. ఈ ఉద్యమం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ పెద్దన్న పాత్ర వహించనుంది. జీహెచ్ ఎంసీ పరిధిలో ఉన్న 4,846 కాలనీలు, బస్తీలు, కంటోన్మెంట్లు, కాలనీల్లో ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు.


గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే 18ఏళ్లకు పైబడిన వారు 70 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. మిగిలిన 30 శాతంతో పాటు ఇంకా ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకోని వారు ఉంటే వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు జీహెచ్ఎంసీ విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. దీనిలో భాగంగా  జీహెచ్ఎంసీ పరిధిలో 175 ప్రత్యేక సంచార వైద్య కోవిడ్ వాక్సిన్ వాహనాలను ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా కంటోన్మెంట్ పరిధిలో మరో 25 వాహనాలను వైద్య ఆరోగ్య శాఖతో కలిపి  ఏర్పాటు చేసింది. 


సోమవారం నుంచి కనీసం పది రోజుల పాటు ఈ స్పెషల్ వాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుంది. ఈ వాక్సిన్ కార్యక్రమానికి ఆదివారమే జీహెచ్ఎంసీ సిబ్బంది, ఆశా, అంగన్‌వాడీ, ఎంటమాలజి బృందాలకు చెందిన సిబ్బంది ఇంటింటికి వెళ్లి వాక్సిన్ వేసుకోని వారి జాబితాను సిద్ధం చేస్తోంది. ఈ జాబితాను వారు ఆరోగ్య సిబ్బందికి అందజేస్తారు. దీనితో పాటు వాక్సిన్ తీసుకొని పౌరులకు తమ కాలనీలో ఏ రోజైతే  ప్రత్యేక వాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తారో ఆ వివరాలను వారికి అందజేయనున్నారు. వ్యాక్సిన్ వేసే వివరాలను వారికి అందజేయనున్నారు. 


కాలనీలు, బస్తీల్లో అర్హులైన వారికి వాక్సిన్ పూర్తయిన అనంతరం, ఆయా కాలనీలు, బస్తీలకు మరో ప్రత్యేక బృందం వెళ్లి వంద శాతం వాక్సిన్ పూర్తయిన అంశాన్ని పరిశీలిస్తారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో "మాకాలనీ/ బస్తీలో వంద శాతం అర్హులైన వారికి వాక్సిన్ పూర్తయింది" అనే బ్యానర్‌ను కూడా ప్రదర్శిస్తారు. ఈ కాలనీ సంక్షేమ సంఘాలకు 100 శాతం వాక్సిన్ పూర్తి చేసినందుకు జీహెచ్ఎంసీ ద్వారా ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందచేస్తారు. 


ఆరోగ్య హైదరాబాద్ లక్ష్యంగా చేపట్టిన ఈ 100  శాతం వాక్సినేషన్ కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు కూడా పర్యవేక్షిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి లు కూడా ఆకస్మికంగా తనిఖీ చేస్తారు. కాగా, ఈ వంద శాతం వాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయడానికి కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులందరిని భాగస్వామం చేయాలని సి.ఎస్. సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.