Telangana Local Body Elections | తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ప్రభుత్వం ఈ నెల చివరి వారం లేదా జులై తొలి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

పదవీకాలం ఎప్పుడు ముగిసిందంటే...?

గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసింది. జిల్లా, మండల పరిషత్తులంటే ఎంపీటీసీల పదవీకాలం జులై 3వ తేదీన, జెడ్పీటీసీల పదవీకాలం జులై 3వ తేదీన ముగిసింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విషయానికి వస్తే చాలా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం జనవరి 26, 2025న ముగిసింది. కొన్నింటికి 2021లో ఎన్నికలు జరిగాయి. వాటి పదవీకాలం ఇంకా ఉంది. ఈ పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల ద్వారా పాలన సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు కొన్ని మున్సిపాలిటీలకు 2021లో ఎన్నికలు జరిగాయి. వీటి పదవీకాలం 2026లో ముగియనుంది.

స్థానిక సంస్థల సంఖ్య తెలుసా...?

తెలంగాణలో 12,991 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్తగా 223 పంచాయతీలను ఏర్పాటు చేశారు. అంతకు ముందు 12,769 పంచాయతీలు ఉండేవి. జిల్లాకో జిల్లా పరిషత్తు ఉంటుంది కాబట్టి, తెలంగాణలోని 33 జిల్లాలకు గాను 33 జిల్లా పరిషత్తులు ఉంటాయి. వీటి పాలనా ప్రతినిధులుగా 33 మంది జెడ్పీటీసీలు ఉన్నారు. తెలంగాణలో 620 మండలాలు ఉన్నాయి. వీటికి మండల పరిషత్తు ఉంటుంది. వీటికి పాలనా ప్రతినిధులుగా 620 ఎంపీటీసీలు ఉన్నారు. తెలంగాణలో కొత్తగా 12 మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. వీటికి కలుపుకుంటే 153కు పెరుగుతుంది. ప్రస్తుతం 131 మున్సిపాలిటీలు ఉన్నాయి.

వేగంగా కొత్త మున్సిపాలిటీలు, కొత్త కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన/ప్రతిపాదించబడిన మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీల వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఈ వివరాలు ఇటీవల వచ్చిన వార్తలు మరియు ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా ఉన్నాయి, కొన్నింటికి సంబంధించిన తుది నోటిఫికేషన్లు ఇంకా వెలువడాల్సి ఉండవచ్చు.

కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఇవే

తెలంగాణలో ప్రస్తుతం 13 కార్పొరేషన్లు ఉండగా, కొత్తగా మూడు మున్సిపాలిటీలను కార్పొరేషన్ హోదాకు అప్‌గ్రేడ్ చేశారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా, మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా, కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. కొత్తగూడెం కార్పొరేషన్‌గా పాల్వంచ మున్సిపాలిటీ, సుజాత్ నగర్ మండలంలోని కొన్ని పంచాయతీలను విలీనం చేసే ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగూడెం కార్పొరేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని అధికారులు చెబుతున్నారు. ఇక మంచిర్యాల, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ల ఏర్పాటు పనులు వేగంగా సాగుతున్నాయి.

కొత్త మున్సిపాలిటీలు ఇవే..

  • ఖమ్మం జిల్లా – కల్లూరు
  • కామారెడ్డి జిల్లా – బిచ్కుంద
  • మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా – ఆలియాబాద్
  • మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా – మూడు చింతలపల్లి
  • మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా – ఎల్లంపేట
  • రంగారెడ్డి జిల్లా – మొయినాబాద్
  • రంగారెడ్డి జిల్లా – చేవెళ్ల
  • మహబూబాబాద్ జిల్లా – కేసముద్రం
  • సంగారెడ్డి జిల్లా – కోహిర్
  • సంగారెడ్డి జిల్లా – గడ్డపోతారం
  • సంగారెడ్డి జిల్లా – గుమ్మడిదల
  • సంగారెడ్డి జిల్లా – ఇస్నాపూర్
  • మహబూబ్‌నగర్ జిల్లా – దేవరకద్ర
  • ఖమ్మం జిల్లా – ఏదులాపురం
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – అశ్వరావుపేట
  • జనగామ జిల్లా – స్టేషన్ ఘన్‌పూర్
  • నారాయణపేట జిల్లా – మద్దూర్
  • ములుగు జిల్లా – ములుగు

అయితే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి కొత్త మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు కూడా ఎన్నికలు జరుపుతారా లేదా అన్నది మాత్రం చూడాలి. ఇప్పటికైతే వీటి ఏర్పాటుపై అధికారులు తీవ్రంగా కసరత్తు నిర్వహిస్తున్నారు.