Telangana Elections :   ఎన్నికలు అంటే ముందుగా ఎక్కువగా పార్టీలు ఖర్చు పెట్టేది మద్యం మీదనే. అందుకే మద్యం వ్యాపారులు ఎన్నికల పండుగ చేసుకుంటారు. తెలంగాణలోనూ అంతే. అయితే మద్యం వ్యాపారులకు ఊహించని కష్టం వచ్చింది. అమ్మకాలు పెరిగాయి కానీ.. వచ్చిన డబ్బును బ్యాంకులో జమ చేసుకోలేకపోతున్నారు. ముందుగానే  పోలీసులు పట్టుకుంటున్నారు. కోడ్ అమల్లో ఉండటమే దీనికి కారణం. పట్టుబడుతున్న డబ్బులో మద్యం వ్యాపారులదే ఎక్కువ ఉందని వారంటున్నారు. 


ఎన్నికల కోడ్ కారణంగా రూ. 50వేల కన్నా ఎక్కువ ఉంటే స్వాధీనం !                         


తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.. నవంబర్ 30వ తేదీ పోలింగ్ జరగనుంది.. ఈ క్రమంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల నిబంధనల ప్రకారం మందు, డబ్బు విషయంలో నియంత్రణలు ఉన్నాయి. 50 వేల రూపాయలకు కంటే ఎక్కువ డబ్బు తరలించటానికి వీల్లేదు.. అలా ఎవరైనా 50 వేల రూపాయలకు మించి డబ్బును తీసుకెళుతున్నట్లు అయితే.. అందుకు సంబంధించిన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అందుకే పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి ఎక్కడ యాభై వేలు కన్నా ఎక్కువ తీసుకెళ్తున్నట్లుగా కనిపించినా పట్టేసుకుంటున్నారు. 


చేర్యాలను రెవెన్యూ డివిజన్‌ గా చేస్తాం! త్వరలో మెడికల్, నర్సింగ్ కాలేజీలు: జనగామ సభలో సీఎం కేసీఆర్


పట్టుబడుతున్న డబ్బులో లిక్కర్ వ్యాపారులదే ఎక్కువ ! 


హైదరాబాద్ తోపాటు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతుంది. ఇందులో లిక్కర్ సేల్స్.. వైన్ షాపులకు సంబంధించిన డబ్బు ఎక్కువగా ఉంటుంది అనేది వైన్స్ షాప్ యజమానులు చెబుతున్నారు.  లిక్కర్.. వైన్ షాపులు, బార్లలోని సేల్స్ కౌంటర్ ను బ్యాంకుల్లో డిపాజిట్ చేయటానికి తీసుకెళుతున్న సమయంలో.. పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నట్లు చెబుతున్నారు  . అక్టోబర్ 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు.. అంటే ఐదు రోజుల్లోనే.. 56 వైన్ షాపులకు సంబంధించిన డబ్బు సీజ్ చేశారని అంటున్నారు.   ఉద్యోగి వివరాలు, లైసెన్స్ పత్రాలు చూపించినా.. పోలీసులు విడిచిపెట్టటం లేదని.. సీజ్ చేస్తున్నారు ఆరోపిస్తూ.. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కంప్లయింట్  చేశారు. పై నుంచి స్పందన రావాల్సి ఉంది.                                  


రూ.102 కోట్ల ఆస్తులు సీజ్ - కాంట్రాక్టర్ల ఇళ్లపై ఐటీ దాడులు


మద్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు ఎక్కువ


మధ్యం దుకాణాల్లో నగదు లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. డిజిటల్ పేమెంట్స్ ఉన్నా... మద్యం వ్యాపారాలు రెండు శాతం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అందుకే..  కస్టమర్లు కూడా నగదు లావాదేవీలతో ద్వారానే మద్యం కొనుగోలు చేస్తూంటారు. రోజుకు లక్షల్లో టర్నోవర్ ఉంటుంది కాబట్టి బ్యాంకుల్లో జమ చేయడం పెద్ద సమస్యగా మారింది. కోడ్ వల్ల సేల్స్ పెరిగినా.. మొత్తానికే తేడా వస్తోందని ఎక్కువ మంది బాధపడుతున్నారు.