Telangana News: తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ పేరుతో రాహుల్ గాంధీ మోసం చేశారని విమర్శిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. తెలంగాణలో రుణమాఫీ అందని లక్షలాది మంది రైతుల తరఫున ఈ లేఖ రాస్తున్నానని కేటీఆర్ తెలిపారు. సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఈ లేఖలో పొందుపరిచారు. 


‘‘మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్వాకం వలన ధగా పడిన లక్షలాది మంది తెలంగాణ రైతుల తరఫున మీకు ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలతో ముఖ్యంగా ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటున్న రైతు రుణమాఫీ మోసం వలన లక్షలాదిమంది రైతులు తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు విడుదల చేసిన హామీలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అనేది అత్యంత కీలకమైన అంశం అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. 


అబద్ధాలు, అభూతకల్పనలతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను నిలువునా మోసం  చేస్తున్నారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన సీఎం రేవంత్.. 3 విడతలుగా మోసం చేస్తూ.. 8 నెలలుగా ఊరించి ఊరించి చివరికి రైతులను ఉసూరుమనిపించారు. కనీసం 40 శాతం కూడా రుణమాఫీ పూర్తిచేయకుండానే వందశాతం రుణమాఫీ పూర్తయిపోయిందని ప్రకటించడం వందకు వందశాతం అబద్ధం. అందుకే తెలంగాణలో రుణమాఫీ పేరిట జరిగిన నయవంచనకు సంబంధించిన లెక్కలు మీకు తెలుసో లేదో అనే ఉద్దేశంతో సీఎం చెప్పిన అబద్ధాలు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఉన్న స్పష్టమైన తేడాను ఈ లేఖలో పొందుపరుస్తున్నాను. 


గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు లక్షరూపాయల రుణమాఫీ చేస్తేనే 17 వేల కోట్లు ఖర్చయింది. ఏకంగా 36 లక్షల మంది రైతులు రుణవిముక్తులై లబ్ది చేకూరింది. కాంగ్రెస్ చెబుతున్నట్టు రెండు లక్షల రుణమాఫీ పూర్తయితే.. లబ్దిదారుల సంఖ్యతోపాటు రుణమాఫీ మొత్తం పెరగాలి, దాదాపు రెట్టింపు కావాలి. కానీ కేవలం 17,900 కోట్లతో రెండు లక్షల రుణమాఫీని పూర్తిచేశామనడం ముఖ్యమంత్రి డొల్లవాదనకు నిదర్శనం. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి 22 లక్షల మందికి తూతూమంత్రంగా చేయడం.. కాంగ్రెస్ సర్కారు అసమర్థతకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది.


అసలు లక్ష రూపాయల రుణమాఫీ కన్నా.. రెండు లక్షల రుణమాఫీ లబ్దిదారుల సంఖ్య 14 లక్షలు తగ్గడం  రైతు రుణమాఫీ ఏ మేరకు విఫలమైందో అద్దం పడుతుంది. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ లెక్క ప్రకారం రెండు లక్షల రుణమాఫీకి 49,500 కోట్లు అంచనా వేశారు. ముఖ్యమంత్రే స్వయంగా రుణమాఫీకి 40వేల కోట్ల వరకు అవుతుందని తొలుత చెప్పుకొచ్చారు. కడుపు కట్టుకుంటే.. ఇది పెద్ద విషయం కాదని ఇంటర్వ్యూల్లో గొప్పలు చెప్పారు. చివరికి రాష్ట్ర కేబినెట్ సమావేశం వరకు వచ్చే సరికి 31 వేలకు దీన్ని కుదించారు. కనీసం అంతమేరకైనా చేశారా అంటే అదీ లేదు. 


రాష్ట్ర బడ్జెట్ లో మరింత కోత పెట్టి 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. తీరా మూడు విడతల రుణమాఫీ తతంగాన్ని రూ.17,933 కోట్లతో మమ అనిపించారు. 49,500 కోట్ల రూపాయల రెండు లక్షల రుణమాఫీ కాస్తా.. మూడు విడతల్లో దాదాపు మూడింతలు తగ్గి 17,933 చేరింది. 40 శాతం కూడా రుణమాఫీ చేయకుండా.. లక్షలాది మంది రైతులను నట్టేట ముంచి ప్రక్రియ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి చేతులెత్తేయడంతో.. యావత్  తెలంగాణ ఇవాళ రైతుల ఆందోళనలతో అట్టుడుకుతోంది.


కాంగ్రెస్ అధిష్టానానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. రైతులను నిలువునా  మోసం మోసం చేసిన ఈ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు తన వైఖరి మార్చుకొని రాష్ట్రంలోని అన్నదాతలందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని రాష్ట్రంలోని అన్నదాతల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అప్పటివరకు తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాను’’ అని లేఖలో రాశారు.