Rakesh Reddy Warangal Khammam Nalgonda Graduates MLC Election| హైదరాబాద్: తెలంగాణకు కావలసింది ధిక్కార స్వరాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని, అధికార స్వరాలు కాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి (Rakesh Reddy)ని గెలిపించాలని కోరారు. రాకేష్ రెడ్డి హన్మకొండ జిల్లాలోని ఒక మారుమూల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించారని.. ప్రతిష్టాత్మక సంస్థ బిట్స్ పిలానిలో విద్యాభ్యాసం చేశారని పేర్కొన్నారు. మేనేజ్‌మెంట్ అండ్ ఎకనామిక్స్‌లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందినట్లు తెలిపారు.


రాకేష్ రెడ్డికే తొలి ప్రాధాన్యత ఓటు
ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మీ మొదటి ప్రాధాన్యత ఓటు రాకేష్ రెడ్డికే వేసి, గెలిపించాలని కోరారు. రాకేష్ రెడ్డి అమెరికాలో ఏడేళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేశారని.. అయితే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారని కేటీఆర్ ట్వీట్ చేశారు. రాకేష్ రెడ్డి అద్భుతమైన వాగ్ధాటితో పాటు పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన వ్యక్తి అన్నారు. సమకాలీన రాజకీయాంశాలపై, ఆర్థిక స్థితిగతులపై ప్రముఖ వార్తా పత్రికల్లో రాకేష్ రెడ్డి ఆర్టికల్స్ రాశారని తెలిపారు. వీటితోపాటు పుస్తక రచనలోనూ అనుభవం ఉందన్నారు. నవశకానికి నాంది, ఫిస్కల్ ఫెడరలిజం, ప్రగతి రథ చక్రాలు,  తెలంగాణ ఎకానమీ, ద డాన్ ఆఫ్ న్యూ ఎరా లాంటి పుస్తకాలను రాకేష్ రెడ్డి రచించారు


సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులకు ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీపై గెస్ట్ లెక్చర్లు ఇచ్చిన అనుభవం రాకేష్ రెడ్డి సొంతం. పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యే పేద విద్యార్థుల కోసం పాటుపడ్డారని చెప్పారు. ఈ-క్లాసెస్ యాప్ అనే ఫ్రీ కోచింగ్ యాప్‌ను రాకేష్ రెడ్డి రూపొందించి అభ్యర్థులకు ఉచితంగా అందజేశారు. ఉద్యోగాల కల్పన కోసం హన్మకొండలో మెగా జాబ్ మేళాలు సైతం నిర్వహించారని కేటీఆర్ పేర్కొన్నారు. 


రాకేష్ రెడ్డి పనితనం, కార్యక్రమాలు ఇదే 
‘విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యోగుల సమస్యల, హక్కులపై టీవీ చర్చల్లో చురుగ్గా పాల్గొని గళం విప్పిన నేత రాకేష్ రెడ్డి. వరంగల్‌లో వరదలు వచ్చినప్పుడు, కరోనా మహమ్మారి సమయంలో ప్రజలకు అండగా నిలిచి తన వంతు సహాయాన్ని అందించారు. ఇండస్ ఫౌండేషన్ ద్వారా వరండల్‌లో కూచిపూడి, పేరిణి లాంటి నృత్య కళలను ప్రోత్సహించారు. పల్లె సంస్కృతులను, సాహిత్యాన్ని, మన జానపద కళారూపాలను పరిరక్షించడం కోసం కృషి చేస్తున్న వ్యక్తి రాకేష్ రెడ్డి. ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీర్ఎస్ అభ్యర్థిగా సరైన చాయిస్ అని రాకేష్ రెడ్డిని కేసీఆర్ బరిలో నిలిపారు. ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపిస్తే.. పట్టభద్రుల గొంతుకగా నిలిచి.. నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని’ కేటీఆర్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. 


Also Read: 6 నెలల్లో రేవంత్ సర్కార్ చేసింది జీరో - రైతుల్ని ఆదుకోవాలి - బీఆర్ఎస్ డిమాండ్