KTR: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన  బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో  ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. శుక్రవారం కవితను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెను కలిసిన అనంతరం కేటీఆర్ హైదరాబాద్‌కు తిరుగు పయనం అయ్యారు. ఇటీవలే కవితకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో రెండు వారాల పాటు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగించిన సంగతి తెలిసిందే. కవిత జూన్ 21వ తేదీ వరకు జైలులో రిమాండ్ లో ఉండనున్నారు. మరోవైపు కోర్టులో చదువుకోవడానికి ఆమె తొమ్మిది పుస్తకాలు కావాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించింది. తదుపరి విచారణ ఈ నెల 21న జరుగనుంది. అదే రోజు సీబీఐ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. అయితే కవితను బయటకు తీసుకురావడానికి ఆమె కుటుంబం ఎప్పటికప్పుడు  ప్రయత్నిస్తూనే ఉంది.


మార్చి 15న అరెస్ట్ 
ఎమ్మెల్సీ కవితను మార్చి 15న హైదరాబాద్‌లో ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  కాగా.. ఇటీవల ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుంది.  దాని పరిశీలించిన కోర్టు కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 3 వరకు పొడిగించింది. అటు కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ  సప్లిమెంటరీ చార్జిషీట్‌ ను దాఖలు చేసింది. దానిపై కూడా కోర్టు విచారణ జరిపి రౌస్ ఎవెన్యూ కోర్టు జులై 3కు వాయిదా వేసింది. కవితతో పాటు మరో నలుగురు నిందితుల పాత్రపై ఈడీ మే 10న ఈడీ దాదాపు ఎనిమిది వేల పేజీలతో అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత, గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ప్రచారం చేసిన ముగ్గురు ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానెల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్‌ను నిందితులుగా ఈడీ చార్జి షీట్లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను మే 29న ట్రయల్ కోర్టు పరిగణనలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది.   
 
అసలు ఢిల్లీ మద్యం కేసు ఏంటి ?  
2021 వరకూ ఢిల్లీలో ప్రభుత్వమే మద్యం అమ్మేది. ఆ తర్వాత ఏడాది నుంచి ప్రైవేటుకు ఇవ్వాలని అనుకున్నారు. ఈ క్రమంలో పెట్టిన రూల్స్‌లో గోల్‌మాల్ జరిగిందని బీజేపీ ఆరోపించింది. దీనిపై నాటి లెఫ్టినెంట్ గవర్నర్ సీబీఐ ఎంక్వైరీ వేయించారు. దీంతో మొత్తానికి ఆ పాలసీయే రద్దు చేసి, పాత పద్ధతిలోనే వెళ్లాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించింది.  2021 నవంబర్ నుంచి కొత్త పద్ధతి అమలయింది. ప్రైవేటు సంస్థలకు మందు అమ్మే పద్ధతి ప్రారంభించడంతోపాటు, మాఫియాను నియంత్రించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం, వినియోగదారుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్టు ఆప్ సర్కార్ ప్రకటించింది. 


వ్యాపారులకు లాభాల పంట
 కొత్త పద్ధతి వల్ల గతం కన్నా ఎక్సైజ్ డిపార్టుమెంట్ కు 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని చెప్పింది. ఎంఆర్‌పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. అందుకు అనుగుణంగా విక్రయదారులకు డిస్కౌంట్లు అందించింది.  మద్యం రిటైలర్లు,  ఉచితాలు ఇస్తూ అమ్మకాలు పెంచుకున్నారు. పలు బ్రాండ్లపై ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో ఢిల్లీలో అమ్మకాలు పెరిగాయి. ఇలా ప్రైవేట్ వారికి అప్పగించే క్రమంలో అక్రమాలు జరిగాయని, పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని ఆరోపణలు వచ్చాయి.  సీబీఐ ఎంక్వైరీ జరిగింది. తర్వాత మనీష్ సిసోదియా ఇంటిలో సీబీఐ సోదాలు, కేసులో కవిత హస్తం కూడా ఉందని బీజేపీ ఆరోపించింది. ఆప్ నాయకులకు రూ.100 కోట్లు చెల్లించి, అనుచిత ప్రయోజనాలను పొందేందుకు కుట్ర పన్నారని ఈడీ ఆరోపించింది.